నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలతో అల్లాడిపోతున్న వారికి మారుతి సుజుకి త్వరలోనే ఓ చురక అంటించేందుకు సిద్ధమవుతోంది. దేశపు అగ్రగామి కార్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశపెట్టిన మొట్టమొదటి బహుళ ప్రయోజన వాహన (ఎమ్పివి) మారుతి సుజుకి ఎర్టిగా ధరను పెంచేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. వచ్చే జులై నాటికి ఎర్టిగా ధరను సవరిస్తామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఎమ్పివి సెగ్మెంట్లో సరమైన ధరకే విడుదలైన మారుతి సుజుకి ఎర్టిగాకు దేశీయ మార్కెట్ నుండి అశేష ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇది మార్కెట్లోకి విడుదలైన మొదటి నెలలోనే 32,000 యూనిట్లకు పైగా బుకింగ్లను తన ఖాతాలో వేసుకుంది. మరికొద్ది నెలల్లోనే ఎర్టిగా ఎమ్పివి ధరను సవరిస్తామని మారుతి సుజుకి మార్కెటింగ్ హెడ్ మయాంక్ పారీక్ వెల్లడించారు.
దీనిని బట్టి చూస్తుంటే, మారుతి సుజుకి ఎర్టిగాకు మార్కెట్లో డిమాండ్ కల్పించేందుకు గానూ ప్రారంభ ధరలకే (ఇంట్రడక్టరీ ప్రైస్) కంపెనీ విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే, మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్పివి ధరలు రూ.10,000 నుండి రూ.20,000 మధ్య పెరిగే ఆస్కారం ఉంది. అయితే, ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో కేవలం డీజిల్ వేరియంట్ ఎర్టిగా ధరలను మాత్రమే మారుతి సుజుకి పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.





















