గడచిన నెల రోజులుగా లాకౌట్లో ఉన్న మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో ఉత్పత్తిని కంపెనీ నేడు పునఃప్రారంభించింది. భారీ భద్రతల మధ్య కంపెనీ ఈ ప్లాంట్ను ప్రారంభించింది. గతనెలలో మానేసర్ ప్లాంటులో కార్మికులు అల్లర్లకు పాల్పడిన నేపథ్యంలో హర్యానా సర్కారు సుమారు 500 మంది భద్రతా సిబ్బందింని ఈ ప్రాంతంలో నియమించింది.
ఇందులో 200 మంది పోలీసులు ప్లాంటు లోపలి వైపు గస్తీ కాస్తుండగా, మిగిలిన 300 మంది ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. పూర్తి రక్షణ, సాయుధ బలగాల కాపలాతోనే ప్లాంటులో ఈరోజు ఉత్పత్తి ప్రారంభమైంది. హర్యానా సర్కారు నియమించిన పోలీసులే కాకుండా, కంపెనీ ప్రత్యేకించి మరో 100 మంది సెక్యూరిటీ ఫోర్స్ను కూడా నియమించుకుంది. ప్రస్తుతం ఈ ప్లాంట్లో 300 మంది పర్మినెంట్ వర్కర్లు మాత్రమే పనిచేస్తున్నారు.
గత నెల మూడవ వారంలో మానేసర్ ప్లాంటులో చోటు చేసుకున్న అల్లర్ల వలన మానేసర్ ప్లాంటులో భారీగా ఆస్తి నష్టం జరగటమే కాకుండా, కంపెనీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) మరణానికి కూడా దారి తీసింది. అంతేకాకుండా, ఈ గొడవల్లో సుమారు 100 మంది వరకూ కంపెనీ సిబ్బంది గాయాలపాలయ్యారు. మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్లో మొత్తం 3000 మంది శాశ్వత ఉద్యోగులు, 2,800 మంది తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారు.
కాగా.. మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో శాశ్వత కార్మికుల తొలగిస్తూ కంపెనీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై ఇటు గుర్గావ్ ప్లాంట్ కార్మికులు, అటు లెఫ్ట్ పార్టీలు అసంతడప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలోనైనా మరోసారి సమ్మె వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉండటంతో కంపెనీ భారీ సంఖ్యలో పోలీసులను మోహరింపజేసింది.





















