ప్రస్తుతం రూపాయి విలువను తలచుకుంటుంటే, వేదం సినిమాలో సూపర్ హిట్ అయిన రూపాయ్.. పాట గుర్తుకు రాకమానదు. విదేశీ మారకపు కరెన్సీతో పోల్చుకుమటే రూపాయి విలువ నానాటికి తగ్గిపోతున్న నేపథ్యంలో, ఈ పరిస్థితి ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళనలో పడేస్తుంది. ఈ రూపాయి భారాన్ని తట్టుకునేందుకు ఉత్పత్తుల ధరలను మరోసారి పెంచాలని ఆటో కంపెనీలు యోచిస్తున్నాయి.
ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో సతమతవుతున్న సామాన్యుడిపై ఆటోమొబైల్ కంపెనీలు కొత్త భారాన్ని మోపేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సంవత్సరంలో ఇప్పటికే రెండు సార్లు ధరలు పెరిగిన సంగతి తెలిసిందే (జనవరి నెలలో ఒకసారి, యూనియన్ బడ్జెట్ 2012-13 విడుదలైన తర్వాత మరోసారి). కరెన్సీ విలువ పెద్దగా ఆశించిన మార్పు కనబడకపోవటం, చమురు దిగుమతి బిల్లు దిగిరాకపోతుండటంతో కాస్త భారాన్ని తమపై తప్పించి వినియోగదారులపై మోపేందుకు ఆటో కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.
ఈ నేపథ్యంలో జనరల్ మోటార్స్, టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ఈ కంపెనీలు ధరల పెంపుపై ఓ నిర్ణయాన్ని వెల్లడించే ఆస్కారం ఉంది. మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా వంటి బిగ్షాట్ కంపెనీలు కూడా జిఎమ్, టొయోటాల రూట్నే ఫాలో కానున్నాయి.
గత కొద్ది నెలల నుండి ఖర్చల ఒత్తిడిని ఎదుర్కుంటున్నామని, దీంతో ధరలు పెంచాలని నిర్ణయించామని, అయితే ఎంత మేర పెంచాలనే విషయమై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, జూన్ నుండి ధరలు పెరిగే ఆస్కారం ఉందని టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ డిప్యూటీ ఎమ్డి (మార్కెటింగ్) సందీప్ సింగ్ తెలిపారు. జనరల్ మోటార్స్ కూడా జూన్ 1వ తేదీ నుండి ఉత్పత్తుల ధరలను పెంచాలని నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా పెట్రోల్ కార్ల అమ్మకాలు తగ్గముఖం పట్టిన నేపథ్యంలో వీటిపై ధరల పెంపు పెద్దగా ఉండకపోవచ్చని అంచనా.





















