ఇకపై టొయోటా వాహనాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఇదివరకటి కథనంలో చెప్పుకున్నట్లుగానే, టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) తమ వాహనాల ధరలను 2 శాతం మేర పెంచనున్నట్లు ప్రకటించింది. రూపాయి మారకపు విలువ తమపై తీవ్ర ప్రభావాన్ని చూపున్న నేపథ్యంలో, తమకు వేరే మార్గం లేక ఈ భారంలో కొంత వినియోగదారులపై మోపక తప్పడం లేదని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ పడిపోవడంతో కారణంగా, ధరలపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతోందని, ఈ నేపథ్యంలో ప్రస్తుత ధరలకు వాహనాలను విక్రయించడం కష్టసాధ్యమని, అందుకే ఒకటి రెండు రోజుల్లో ఉత్పత్తుల ధరలను పెంచనున్నామని టొయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ సింగ్ తెలిపారు.
అయితే, ఎంత మొత్తంలో ధరలను పెంచనున్నారనే విషయాన్ని ప్రస్తావించగా, ప్రస్తుతం మార్కెట్ మందకొడిగా సాగున్న నేపథ్యంలో, మొత్తం భారాన్ని వినియోగదారులపై మోపబోమని, 1-2 శాతం మేర మాత్రమే పెంపు ఉంటుందని ఆయన సమాధానమిచ్చారు. కాగా.. ఏయే మోడళ్లపై ఎంత మేర ధరలు పెరగనున్నాయనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించేందు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని, రూపాయి పతనాన్ని గమనిస్తే.. త్వరలోనే ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా టొయోటా బాటలోనే ప్రయాణించి ఉత్పత్తుల ధరలను పెంచడం ఖాయం.





















