భారతదేశ అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ వారి చిన్న కారు ఎ-స్టార్ ను యూరప్ కు చెందిన నిస్సాన్ సంస్థ అక్కడ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మూడేళ్ల పాటు కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం నిస్సాన్ ప్రతీ ఏడాదీ మారుతీ సుజుకీ నుండీ 35,000 యూనిట్ల ఎ-స్టార్ కార్లను దిగుమతి చేసుకొని యూరప్ దేశాల్లో పంపిణీ చెయ్యనుంది. ఈ సందర్భంగా మారుతీ సుజుకీ చైర్మెన్ ఆర్ సి భార్గవ మాట్లాడుతూ "యూరప్ దేశాల్లో ఎ-స్టార్ కారు మీదున్న మక్కువతో ఈ కార్లను అక్కడ పంపిణీ చేసేందుకు ప్రముఖ సంస్థ నిస్సాన్ ముందుకొచ్చిందని, అందుకు చాలా సంతోషంగా వుందని తెలిపాడు".
అంతే కాదు ఈ ఏడాదికి 35వేల యూనిట్లను ఆర్డర్ చేసిన నిస్సాన్ వచ్చే ఏడాదికి ఈ సంఖ్యను 54 వేల యూనిట్లకు పెంచిందని కూడా ఆయన ప్రకటించారు. ఇదిలా వుండగా గత నెలలో మారుతీ సుజుకీ రీకాల్ కు పిలుపునిచ్చిన ఈ కార్లనే నిస్సాన్ ఏరికోరి మరీ పంపిణీ చెయ్యాలని ఉబలాటపడుతుండటం విశేషం. కాగా గత నెలలో మారుతీ సుజుకీ లక్ష ఎ-స్టార్ కార్లను రీకాల్ కు పిలుపునిచ్చింది.