ఆటోమొబైల్ రంగానికి సువర్ణభూమిగా అభివర్ణితమవుతున్న భారతదేశంలో నెం.1 ఆటోమొబైల్ సంస్థగా మారుతీ సుజుకీ ఎంపికయింది. సియామ్ (Society of Indian Automobile Manufacturers) వెళ్లడించిన వివరాల ప్రకారం మారుతీ సుజుకీ మొత్తంగా 81,087 యూనిట్లను అమ్మి ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో మరో భారతీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ నిలిచింది. కాగా టాటా మోటార్స్ రెండేళ్ల అనంతరం హుందాయ్ మోటార్స్ ని వెనక్కునెట్టి తిరిగి ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోగలిగింది. ఇంతకు ముందు రెండవ స్థానంలో నిలబడిన ఆటోసంస్థ హుందాయ్ మోటార్స్ ఈ సారి మూడవ స్థానంతో సర్దుకోవాల్సి వచ్చింది.
టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరిలో మొత్తంగా 31,081 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసుకోగా, హుందాయ్ మోటార్స్ 29,601 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసుకుంది. ఇటీవలే విడుదలయిన టాటా మంజా, విస్తా కార్లు టాటా సంస్థ అమ్మకాల పెరుగుదలకు దోహదం చేసాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఢిల్లీ వంటి నగరాల్లో టాటా మంజా కార్లు కావాలంటే రెండు నుండీ మూడు వారాల పాటు వేచివుండాలంటే ఈ కార్లకున్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.