మొన్న ప్రసాద్.. నిన్న అయాజుద్దీన్.. నేడు ప్రతీక్ రెడ్డి..

వాస్తవానికి మనం ఉపయోగించే వాహనంలో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎయిర్బ్యాగ్స్, బ్రేక్ అసిస్ట్, క్రాష్ ప్రొటెక్షన్ ఇలాంటి ఎన్నో అత్యాధునిక భద్రతా వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నప్పటికీ, నిర్ధిష్ట వేగానికి మించి వాహనాన్ని నడిపినట్లయితే వీటి పనితీరు అంతంత మాత్రంగానే ఉంటుంది.
ఉదాహరణకు 60 కి.మీ. వేగంలో ప్రయాణించే వాహనాన్ని అదుపు చేయడం సులువు, అదే వాహనం 120 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు అదుపు చేయడం కష్టం. నిజానికి మన దేశపు రోడ్లు వేగంగా ప్రయాణించే కార్లు, బైకులకు సరిపోవనేది జగమెరిగిన సత్యం.
మరి ఇలాంటి రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్త వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా జాతీయ రహదారుల (హైవేల)పై ప్రయాణిస్తున్నప్పుడు మరింత మెళకువగా మెసలుకోవాల్సి ఉంటుంది. మనం జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతున్నప్పటికీ, ఇతరులు చేసే తప్పిదాల కారణంగా మనం ప్రమాదాల బారిన పడే ఆస్కారం ఉంది.
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తనయుడు ప్రతీక్ రెడ్డి తన ఇద్దరు మిత్రులతో కలిసి రిజిస్ట్రేషన్ నెంబర్ 'ఎపి 24 ఎహెచ్ 9999' కలిగిన ఓ స్కొడా కారులో అధిక వేగంతో ప్రయాణిస్తుండగా పటాన్ చెరువు సమీపంలోని కొల్లూరు వద్ద రోడ్డుపై అడ్డుగా వచ్చిన గొర్రెలను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో స్కొడా కారు పూర్తిగా నుజ్జు నజ్జు అయిపోయింది. డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్బ్యాగ్లు డిప్లాయ్ అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా ఈ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమై, మృతుల కుటుంబాల్లో తీరని లోటును మిగిల్చింది.
వీళ్లంతా ప్రముఖులు, సెలబ్రిటీల సంతానం కాబట్టి మీడియా కథనాల్లో ఈ ప్రమాదాల గురించి తెలుసుకుంటున్నాం. కానీ, కెమరాకు చిక్కని, పత్రికకు ఎక్కని ఇలాంటి ఎన్నో ప్రమాదాలు దేశంలో ప్రతిచోటా, ప్రతిరోజు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మేలుకుందాం.. ఇకనైనా తెలుసుకుందాం.. "వేగం కన్నా ప్రాణం మిన్న". రోడ్లపై సురక్షితంగా ప్రయాణించండి..!


Click it and Unblock the Notifications








