టాప్ 10 ట్రక్ కంపెనీల సరసన చోటుకు అశోక్ లేలాండ్ ప్లాన్స్..!
హిందూజా గ్రూపునకు చెందిన అశోక్ లేలాండ్ రానున్న ఐదు-పదేళ్లలో ప్రపంచంలోని పది అగ్ర ట్రక్ తయారీ కంపెనీల సరసన చేరాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్రక్కుల రంగంలో అశోక్ లేలాండ్ 20వ స్థానంలో ఉండగా... బస్సుల తయారీలో 10వ స్థానంలో ఉందని కొత్త కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కే దాసరి చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి ఆర్. శేషసాయి స్థానంలో దాసరిని కంపెనీ నియమించింది. కాగా.. శేషసాయికి పదోన్నతి కల్పించి కంపెనీ వైస్ చైర్మన్గా నియమించారు.
రాజస్థాన్లోని అల్వార్లో 50 కోట్ల పెట్టుబడితో బస్ బిల్డింగ్కు ర్యాప్ ఏర్పాటు చేస్తామని, విదేశీ మార్కెట్లలో తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు సరైన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు. మధ్యప్రాచ్యదేశాలతో పాటు, దక్షిణ ఆఫ్రికా, లాటిన్ అమెరికా మార్కెట్తో పాటు సార్క్ దేశాల్లో కూడా తమ మార్కెట్ను విస్తరిస్తామని దాసరి వివరించారు. అలాగే.. ప్రస్తుతం 270గా ఉన్న డీలర్ల సంఖ్యను 350కు పెంచుతామని ఆయన చెప్పారు.
కాగా.. ఒక్క మార్చి నెలలో అశోక్ లేలాండ్ విక్రయాలు 21 శాతం పెరిగాయి. ఒక్క నెల వ్యవధిలో తాము అత్యధికంగా విక్రయించిన వాహనాల రికార్డు ఇదేనని కంపెనీ పేర్కొంది. అలాగే.. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2010-11 ఆర్థిక సంవత్సరానికి గానూ అశోక్ లేలాండ్ మొత్తం వాహన విక్రయాలలో 47 శాతం వృద్ధిని సాధించి 94,105 వాహనాలను విక్రయించినట్లు తెలిపింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయానికి కంపెనీ విక్రయాలు కేవలం 63,926 యూనిట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








