బిఎమ్డబ్ల్యూకు చెమటలు పట్టిస్తున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్

"నేను అది (జేఎల్ఆర్) కాంపిటీషన్ కాదని చెబితే, అది తప్పు అవుతుంది. ఖచ్చితంగా అది కాంపిటీషనే" అని బిఎమ్డబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ వెల్లడించారు. గోవాలో కొత్త డీలర్షిప్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా బ్రిటీష్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ గురించి విలేఖరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చూస్తుంటే... మార్కెట్ పోటీని తట్టుకునేందుకే కంపెనీ శరవేగంగా విస్తరణ కార్యకలాపాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది నాటికి మొత్తం డీలర్ల సంఖ్యను 40కు అలాగే 2015 నాటికి 60కు పెంచుకోవాలని కంపెనీ నిర్ణయించింది. ఇంకా చిన్న పట్టణాల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కూడా బిఎమ్డబ్ల్యూ ప్రయత్నిస్తోంది.
కాగా.. లగ్జరీ వాహన మార్కెట్లో మరింత వేడి పుట్టించేదుకు టాటా మోటార్స్ తమ జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్లోని మోడళ్లను ఒక్కొక్కటిగా భారత రోడ్లపైకి తీసుకు వస్తుంది. బిఎమ్డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి బ్రాండ్ల సరసన జేఎల్ఆర్ను కూడా చేర్చాలని టాటా మోటార్స్ భావిస్తోంది. 2008లో బ్రిటన్కు చెందిన జేఎల్ఆర్ను టాటా మోటార్స్ సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ కంపెనీ దాదాపు దివాళా తీసే స్థితిలో ఉంది. కానీ జేఎల్ఆర్ను టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న ఆ కంపెనీ రూపు మారడంతో టాటా మోటార్స్ ప్రతిష్టను కూడా ప్రపంచానికి తెలియజెప్పింది. టాటా చేతికి జేఎల్ఆర్ బ్రాండ్ రావడంతో లగ్జరీ కార్ మార్కెట్లో యుద్ధానికి టాటాకు బ్రహ్మాస్త్రం లభించినట్లయింది.


Click it and Unblock the Notifications








