రూ. 25,000 మేర పెరగనున్న కార్ల ధరలు..!

కమోడిటీస్ (ముడిసరుకుల) ధరలు నానాటికీ పెరుగుతున్న తరుణంలో ధరల వత్తిడి కంపెనీలపై అధికంగా ఉండటం వలన ఉత్పత్తుల ధరలు పెంచక తప్పదని దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి పేర్కొంది. కార్ల తయారీలో ఉపయోగించే ఉక్కు, రబ్బర్ ధరలు చుక్కలనంటుతుండటంతో సదరు సప్లయర్స్తో కుదుర్చుకున్న ఒప్పందాలను పునరుద్ధరించుకోవాల్సి వస్తుందని కంపెనీ వివరించింది. గడచిన కొద్ది నెలలుగా గమనిస్తే.. కాపర్, నికెల్, అల్యూమినియం ధలు కూడా 20-45 శాతానికి పెరిగాయి. ఇటీవల ఇదే కారణంతోనే మారుతి సుజుకి తమ కార్ల ధరలను 2.4 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే.
ఈ ముడిసరుకుల ధరల పెరుగుదల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో హీరో హోండా, మారుతి సుజికి కంపెనీల నికరలాభాల్లో (సంవత్సరం నుంచి సంవత్సరానికి) 20 శాతం నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. దేశంలో అతిపెద్ద ఆటో కంపెనీలైన మారుతి, హీరో హోండాలే ఇంత నష్టాలను భరించినప్పుడు చిన్నతరహా ఆటో కంపెనీలు ఎంత మాత్రం నష్టం వాటిల్లి ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. కానీ సదరు కంపెనీలు నష్టాల విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడ్డాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. టొయోటా కంపెనీ కూడా ధరల పెంపు విషయంపై వచ్చే నెలలో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications








