భారత్ లో ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ. 45 కోట్ల పెట్టుబడులు

ఆటోమొబైల్ సంస్థలకు కావలసిన విడిభాగాలు (ఆటోమోటివ్ పార్ట్స), హెవీ మిషనరీ వంటి మెకానికల్ పరికరాలను తయారు చేసే రెండు ప్లాంట్లను భారత్లో నిర్మించనున్నట్లు హ్యుందాయ్ డబ్ల్యూఐఏ పేర్కొంది. ఇందులో తొలి ప్లాంటును తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబూర్లో 40 లక్షల డాలర్లతో నిర్మించనున్నామని హ్యుందాయ్ డబ్ల్యూఐఏ అధ్యక్షుడు, సీఈఓ హెచ్ఎస్ లీమ్ తెలిపారు. ఈ ప్లాంటు ద్వారా సంవత్సరానికి ఆరు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయవచ్చునని, దీని ద్వారా ఒక్క ఏడాదిలో 100 మంది నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించగలమని ఆయన చెప్పారు.
గత నాలుగేళ్లుగా తమ ఉత్పత్తులను భారత వినియోగదారులకు అందిస్తున్నామని, ఈ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ద్వారా భారతదేశంలో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని లీమ్ అన్నారు. తాము ఏర్పాటు చేయబోయే ప్లాంట్ల ద్వారా పెరుగుతున్న ఆటోమొబైల్ అవసరాలను తీర్చగలమని, రెండవ ప్లాంటును తమిళనాడులో కానీ.. లేదా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయవచ్చునని లీమ్ చెప్పారు.
ఈ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు ఢిల్లీ, చెన్నయ్ లలో కూడా సాంకేతిక కేంద్రాల (టెక్నికల్ సెంటర్)ను కంపెనీ ఏర్పాటు చేయనుంది. మరోవైపు భారత వినియోగదారులకు ట్రాన్సిమిషన్ల సరఫరా కోసం జనరల్ మోటార్స్ కంపెనీతో హ్యుందాయ్ డబ్య్లూఐఏ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ప్రస్తుతం హ్యుందాయ్ డబ్య్లూఐఏకు భారత్లో నాలుగు డీలర్షిప్ కేంద్రాలున్నాయి.


Click it and Unblock the Notifications








