ప్రభుత్వం చెబితే పెట్రోల్ ధరలు తగ్గిస్తాం: చమురు కంపెనీలు

ఇది కొంత మందికి తెలిసిందే మాత్రమే. మరికొందరికి తెలియనది చాలానే ఉంది. అదే నాణేనికి మరోవైపు. అర్థిక పరంగా ఇంత అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటున్న మన దేశం ధరల పెరుగుదలను అదుపు చేయడంలో ఎందుకు విఫలమవుతుంది? ఈ సాకుతో సామాన్యుల జేబులు ఎందుకు కొల్లగొడుతుంది? ప్రస్తుతం కోట్లాది మంది ప్రజల మనస్సులలో మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్నలివి.
సహనానికి కూడా ఓ హద్దు అనేది ఉంటుంది, అది నశిస్తే.. ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వాలు సైతం కూలిపోతాయనేది మన చరిత్ర మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. సరే, ఇదంతా అటుంచి అసలు విషయానికి వస్తే.. ఇటీవల చమరు కంపెనీలు రూపాయి విలువ పతనం, అధిక ముడి చమురు ధరల సాకుతో పెట్రో వడ్డన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతి పక్షాలు, ప్రజల నుండి సర్వత్రా అసంతృప్తి వ్యక్తం కావడంతో చమురు కంపెనీలు ఓ మెట్టు దిగొచ్చాయి.
పెట్రోల్ ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే.. పెట్రోల్ ధరల పెంపును వెనక్కు తీసుకుంటామని చమురు సంస్థలు అంటున్నాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) చైర్మన్ ఆర్.ఎస్. బుటోలా ఓ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, గడచిన సంవత్సరం జూన్ నెలలో భారత సర్కారు పెట్రోల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణలను తొలగిస్తూ రిటైల్ రేట్లను నిర్ణయాధికారాన్ని తమకు అప్పగించిందని, అయితే ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంస్థలు కావడంతో పెరిగిన ధరలను తగ్గించాలంటే ప్రభుత్వ జోక్యం అవసరమని చెప్పారు.
అంతేగానీ, తమకు తాముగా పెట్రోల్ ధరలు తగ్గించే ఆలోచన లేదని ఆయన చెప్పారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) ఛైర్మన్ ఆర్.కె. సింగ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ధరలు తగ్గించమని ప్రభుత్వం ఆదేశిస్తే దాన్ని తప్పకుండా అమలు చేస్తామని సింగ్ చెప్పారు. కాబట్టి.. ఓ సర్కారు సారు... ధరలు తగ్గించమని మీరైనా జెప్పండి సారూ..!!


Click it and Unblock the Notifications








