కాంపాక్ట్ కార్లను విడుదల చేయనున్న మెర్సిడెస్ బెంజ్

ఈ ఏడాది యూరప్ మార్కెట్ కోసం లెఫ్ట్-హ్యాండ్-డ్రైవ్ ఆప్షన్ కలిగిన కార్లను విడుదల చేయనున్నామని అలాగే, భారత్లో 2012 చివరి నాటికి చిన్న కార్లను ప్రవేశపెట్టనున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ పీటర్ హానెగ్ తెలిపారు. ఈ కార్లను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) యూనిట్లుగా దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ కాంపాక్ట్ కార్ల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు 40-50 శాతం విడి భాగాలను భారత్ నుంచే కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫలితంగా మెర్సిడెస్ బెంజ్ కార్ల ఉత్పత్తి వ్యయం తగ్గడమే కాకుండా తక్కువ ధరకే ఈ కార్లు లభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్కు పూణేలోని ఛాకన్లో ఓ ఉత్పత్తి కేంద్రం ఉంది. అయితే, ఇందులో సి, ఎస్, మరియు ఈ క్లాస్ వంటి లగ్జరీ కార్లను మాత్రమే అసెంబ్లింగ్ చేస్తుంది. కానీ, కాంపాక్ట్ కార్లను ఉత్పత్తి చేయడానికి ఈ ప్లాంటులో ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇకపోతే కంపెనీ అమ్మకాల గురించి పీటర్ హానెగ్ మాట్లాడుతూ.. గతేడాది కంపెనీ 5,800 యూనిట్లను విక్రయించిందని, ఈ ఏడాది అమ్మకాలు 7,000 యూనిట్లను అధిగమించవచ్చునని అంచనా వేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం భారత మార్కెట్లో బెంజ్ కార్ల ప్రారంభ ధరలు సుమారు రూ. 26 లక్షల నుండి రూ. 2 కోట్లకు పైబడి ఉన్నాయి. భారత్లో ఏ-క్లాస్ మరియు బి-క్లాస్ కాంపాక్ట్ కార్ల విడుదలతో బెంజ్ కార్లను సొంతం చేసుకోవాలనుకునే వారి కల నిజం కానుందన్నమాట.


Click it and Unblock the Notifications








