మద్యం సేవించి డ్రైవ్ చేసినందుకు ఢిల్లీలో 1,001 మంది అరెస్ట్

గతేడాది సెప్టెంబర్ నెలలో భారత ప్రభుత్వం తాగి వాహనాలు నడపడంపై ఉన్న చట్టాలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం.. తొలిసారి తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే.. ఆర్నెళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2,000 జరిమానా విధిస్తారు. అదే వరుసగా రెండోసారి పట్టుబడ్డితే.. రెండేళ్ల పాటు జైలు శిక్ష మరియు రూ. 3,000 జరిమానా. ఫుల్లుగా మందుకొట్టి వాహనాలు నడపం వలన రోడ్డుపై వెళ్లేవారికి, తోటి ప్రయాణికులకు, తాగిన వ్యక్తికి కూడా ప్రమాదమే కాబట్టి ఈ చట్టాన్ని కఠినతరం చేశారు.
తొలుత పోలీసులు జరిమానాతో వదలిపెట్టేస్తుండంతో.. మందు బాబులు కూడా పెద్దగా పట్టించుకోకుండా.. పెగ్గు మీద పెగ్గేసి.. రయ్.. రయ్.. మంటూ రైడ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో చిర్రెత్తిన పోలీసులు ఈ ఏడాది ప్రారంభం నుంచీ ఏప్రిల్ 15 వరకూ దేశ రాజధానిలో 1,001 మందిని అరెస్టు చేశారు. అందులో దాదాపు 44 మంది 10 రోజులకు పైగానే జైళ్లలో ఊచలు లెక్కబెట్టారు. ఈ శిక్ష కేవలం జైలు, జరిమానాతో ఆగిపోదండోయ్.. పోలీసులు డ్రైవింగ్ లైసెన్సులను కూడా రద్దు చేస్తారు. ఇలా 787 మంది డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు సీనియర్ ట్రాఫిక్ పోలీస్ ఒకరు వెల్లడించారు. చాలా వరకూ యాక్సిడెంట్ కేసులు మద్యపానం సేవించి డ్రైవ్ చేయడం మూలానే జరుగుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








