మరోసారి పెరగనున్న కార్లు, మోటార్సైకిళ్ల ధరలు..!?

ముడి సరుకుల ధరలు పెరిగి ఉత్పాదక వ్యయం పెరగడంతో ఇప్పటికే పలు కంపెనీలు కార్లు, బైకుల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. మారోసారి ధరలు పెంచాల్సి వస్తే అది వినియోగదారులు మరింత భారంగా మారే అవకాశం ఉందని ఆటోమొబైల్ కంపెనీలు భావిస్తున్నాయి. మారుతి, హ్యుందాయ్ వంటి పెద్ద పెద్ద కంపెనీల లాభాలపై అదిక ఇన్పుట్ ధరలు తీవ్ర ప్రభావాన్నే చూపాయి. ధరల భారాన్ని వినియోగదారులపై మోపడం తప్ప తమకు వేరే మార్గం లేదని మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సూచించారు. రెండోసారి ధరలను పెంచాల్సి వస్తే ప్రారంభ మోడళ్ల (రూ. 3 లక్షలు ధర కలిగి ఉండే కార్ల)పై అది రూ. 6,000 వరకూ ఉండవచ్చునని ఆయన తెలిపారు. ఇటీవల కంపెనీ ఆల్టో మినహా అన్ని ఉత్పత్తులపై రూ. 8,000 (1-2 శాతం) మేర ధరలను పెంచిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరిలో జరగనున్న బడ్జెట్ సెషన్లో ఎక్సైజ్ పెంపు కనుక జరిగితే అది మార్కెట్ పరిస్థితులపై ప్రభావం చూపుతుందని హీరోహోండా ఉపాధ్యక్షుడు (మార్కెటింగ్ అండ్ సేల్స్), సీఈఓ అనిల్ దువా అన్నారు. ధరల పెంపుపై చాలా సున్నితంగా స్పందిచాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. గత రెండేళ్ల క్రితం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చేందుకు ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం 4 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా భారత ఆటో పరిశ్రమ భారీవృద్ధిని కనబరచి దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పుంజుకునేలా చేసింది.
అలాగే.. గత బడ్జెట్లో కూడా ఎక్సైజ్ డ్యూటీని రెండు శాతానికి తగ్గించడంతో ఆటోపరిశ్రమ వృద్ధి మరింత విస్తృతమైంది. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం తిరిగి నాలుగు శాతం ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ఇదే కనుక జరిగితే ఆటోపరిశ్రమ జోరుకు బ్రేకులు పడటం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే కంపెనీలు పెరిగిన ఇంధన ధరలు, ఇన్పుట్ ధరలతో తమ లాభాలను ఆర్జించడం కోసం రెడ్ జోన్లో ఉన్నాయి. ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీపై తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆటోమొబైల్ కంపెనీల ఉత్పత్తుల ధరల పెంపు ఆధారపడి ఉంది. ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పరిమితిని పెంచితే మరోసారి కార్లు, మోటార్సైకిళ్ల ధరలకు రెక్కలు రానున్నాయి.


Click it and Unblock the Notifications








