లీటరుకు రూ.6 మేర పెరిగిన ఆటో ఎల్పిజి ధరలు

తాజా పెంపుతో ఆటో ఎల్పిజి ధర రూ.43.65 నుండి రూ.49.72 లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిన కారణంగా ఆటో ఎల్పిజి ధరలను పెంచక తప్పడం లేదని దేశపు అతిపెద్ద చమురు కంపెనీ ఇండియన్ ఆయల్ కార్పోరేషన్ (ఐఓసి) వెల్లడించింది. గడచిన మార్చి 1 వ తేదీన కూడా ఆటో ఎల్పిజి ధరను ప్రతి లీటరుపై రూ.3 మేర పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అప్పట్లో ఆటో ఎల్పిజి ధర లీటరుకు రూ.40.7 నుంచి రూ.43.65కు పెరిగింది.
ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలను పెంచేందుకు తమకు అనుమతి ఇవ్వాలని లేదా సబ్సిడీ ధరలపై పెట్రోల్ను విక్రయిస్తుండటం వల్ల రోజువారీగా వస్తున్న రూ.48 కోట్ల నష్టానికి పరిహారం చెల్లించాలని ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. లేకపోతే ఇంధన సరఫరాలు నిలిపి వేస్తామని సర్కారును హెచ్చరించాయి.
వీరి డిమాండ్లకు కేంద్రం స్పందించి నష్టపరిహారాన్ని చెల్లిస్తే సరేసరి. లేకపోయినట్లయితే, పెట్రోల్ సరఫరా నిలిచిపోవడమో లేదా పెట్రోల్ ధరలు అమాంతం రూ.5-8 మేర పెరగడమో జరిగే ఆస్కారం ఉంది. పెట్రోల్పై అదనంగా 20 శాతం సేల్స్ టాక్స్ విధించిన తర్వాత ప్రతి లీటర్ పెట్రోల్ విక్రయంపై రూ.7.67 చొప్పున నష్టం వాటిళ్లుతోందని ప్రభుత్వ రంగం చమురు సంస్థలు వాపోతున్నాయి.


Click it and Unblock the Notifications








