బెంగుళూరులో మెర్సిడెస్ బెంజ్ రెండవ షోరూమ్ ప్రారంభం
జర్మనీకు చెందిన మెర్సిడెస్ బెంజ్ కార్లను కొనాలంటే అంత ఆషామాషీ కాదు. ఈ బ్రాండ్ షోరూమ్లు అన్ని చోట్లలో అందుబాటులో ఉండవు. కొన్ని ఎంపిక చేసిన నగరాలు, ప్రాంతాలకు మాత్రమే కంపెనీ తమ షోరూమ్లను పరిమితం చేసుకుని సంపన్న వర్గాలను ఆకట్టుకుంటుంది. అయితే, ప్రస్తుతం లగ్జరీ కార్ మార్కెట్లో పోటీ పెరుగుతున్న కారణంగా, మెర్సిడెస్ బెంజ్ తమ నెట్వర్క్ విస్తరణపై దృష్టి సారించింది.
ఇందులో భాగంగానే, దేశపు ఐటి రాజధానిగా చెప్పుకునే బెంగుళూరులో మెర్సిడెస్ బెంజ్ తమ రెండవ షోరూమ్ను ఏర్పాటు చేసింది. వినియోగదారులకు మరింత చేరువ అయ్యే దిశలో భాగంగా కర్ణాటక రాజధాని బెంగుళూరులో రెండో డీలర్షిప్ను ప్రారంభిస్తున్నామని కంపెనీ పేర్కొంది.
బెంగుళూరుకు చెందిన అక్షయ మోటార్స్, మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్కు అధికారిక డీలర్గా వ్యవహరించనుంది. ఈ డీలర్షిప్ను మైసూరు రోడ్డులో ఏర్పాటు చేశారు. సిటీలోని దక్షిణాధి ప్రాంతంలో ఉన్న వినియోగదారులను కవర్ చేసేందుకు కంపెనీ ఈ షోరూమ్ను ఏర్పాటు చేసింది. 65,000 చ.అ. లకు పైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ను మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పీటర్ హానెగ్ ప్రారంభించారు.
ఈ షోరూమ్లో డ్రైవ్-ఇన్ వాలెట్ సర్వీస్, కెఫే-మెర్సిడెస్తో కూడిన కస్టమర్ లాంజ్తో మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లో అందిస్తున్న అన్ని రకాల కార్లను డిస్ప్లేకు ఉంచింది. ఆడియో విజువల్ ప్రెజెంటేషన్స్, బోటిక్యూ కలెక్షన్లు ఈ డీలర్షిప్లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ షోరూమ్లో వర్క్షాప్ కూడా ఉంది. దీని నిర్మాణం కోసం రూ.30 కోట్లు వెచ్చించి, 12 నెలల సమయంలో పూర్తి చేసినట్లు అక్షయ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్.పి. శ్యామ్ తెలిపారు.


Click it and Unblock the Notifications









