త్వరలోనే కార్లకు మైలేజ్ రేటింగ్ విధానం ఖరారు: బీఈఈ
దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఓ ప్రతిపాదనను కూడా చేసింది. ఈ నిబంధనలపై త్వరలోనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా ఎవరైనా కొత్తగా కారు కొనాలనుకుంటే, మొదటిగా ఆలోచించేది మైలేజ్ గురించే. అయితే, కార్ మేకర్లు చూపించే మైలేజ్కు వాస్తవ పరిస్థితుల్లో వచ్చే మైలేజ్కు భారీ వ్యత్యాసం ఉంటుంది.
ఈ మైలేజ్ రేటింగ్ విధానంతో మైలేజ్ విషయంలో ఉన్న సంశయాలకు తెరపడనుంది. ఫ్యూయెల్ ఎఫీషియన్సీ లేబిలింగ్ రూల్స్ను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) రూపొందించింది. ఈ మార్గదర్శకాల ఖరారు చేయటం దాదాపుగా పూర్తయిందని, వివిధ అంశాలపై విస్తృతమైన ఏకాభిప్రాయం కుదిరిందని బీఈఈ డెరైక్టర్ జనరల్ అజయ్ మాధుర్ అన్నారు.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రధానమంత్రి కార్యాలయంలో ఉంది. ఈ మార్గదర్శకాలను రూపొందించడంలో విద్యుత్, భారీ పరిశ్రమలు, రోడ్డు రవాణా, రహదారులు తదితర మంత్రిత్వ శాఖలతో పాటుగా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (ఎస్ఐఏఎమ్)లు కూడా పాల్గొన్నాయి. త్వరలోనే వాహనాలపై ఫ్యూయెల్ ఎఫీషియన్సీ లేబుల్స్ను ప్రదర్శించడం తప్పనిసరిగా మారనుంది.


Click it and Unblock the Notifications









