మే నెల నుండి ఇండోనేషియాకు ఎర్టిగా ఎగుమతులు: మారుతి
మే నెల చివరి భాగంలో ఎర్టిగాను ఇండొనేసియా మార్కెట్కు ఎగుమతి చేయనున్నట్లు మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ జనరల్ మేనేజర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఎర్టిగానూ సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో ఇండోనషియన్ మార్కెట్కు విడిభాగాలుగా దిగుమతి చేసుకొని, అక్కడి మార్కెట్లో ఈ మోడల్ను కంపెనీ అసెంబ్లింగ్ చేయనుందని ఆయన వివరించారు.
ప్రస్తుతం ఇండొనేసియా మార్కెట్లో 3 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటాను, అక్కడి మార్కెట్లోకి ఎర్టిగా ఎమ్పివిని ప్రవేశపెట్టటం ద్వారా మరింత పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఇండోనేషియన్ మార్కెట్లో కూడా పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఎర్టిగాను విడుదల చేయనున్నామని కంపెనీ తెలిపింది.
కాగా.. ఇండియాలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి గమనిస్తే, దేశీయ మార్కెట్లో అమ్ముడయ్యే ఎర్టిగా వాహనాల్లో దాదాపు 80 శాతం వరకూ డీజిల్ మోడళ్లే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం మారుతి సుజుకికు సాలీనా 3,00,000 డీజిల్ ఇంజిన్లను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఇది కాకుండా తాజాగా ఫియట్ ఇండియాతో కలిసి ఏర్పరుచుకున్న జాయింట్ వెంచర్ ద్వారా గుర్గావ్లో మరో 1,00,000 డీజిల్ ఇంజిన్ల తయారీని కంపెనీ చేపడుతోంది.
ఇవే కాకుండా సొంతంగా గుర్గావ్లో 3 లక్షల యూనిట్ల డీజిల్ ఇంజిన్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. రెండు దశల్లో ఏర్పాటు కానున్న ఈ ఇంజన్ ప్లాంటులో తొలి దశ ఉత్పత్తి 2013 మధ్య భాగం నాటికి అందుబాటులోకి రానుంది. 2014 సంవత్సరం నాటికి ఈ ప్లాంటులో పూర్తిస్థాయి కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అంటే మొత్తమ్మీద 2014 నాటికి మారుతి సుజుకి సాలీనీ 7 లక్షల డీజిల్ ఇంజిన్లను ఉత్పత్తి చేయగలదు.


Click it and Unblock the Notifications









