క్యూ3లో 44 శాతం పెరిగిన టాటా మోటార్స్ ఆదాయం
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ పంట పండింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో కంపెనీ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. గడచిన డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ నికరలాభాలు 41.51 శాతం పెరిగి రూ.3,406 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.2424 కోట్లుగా ఉన్నట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు జోరుగా సాగడం కంపెనీ లాభాలకు మరింత ఊతమిచ్చినట్లయింది.
ఇదే త్రైమాసికంలో కంపెనీ సంఘటిత (కన్సాలిడేటెడ్) ఆదాయం 43.95 శాతం వృద్ధి సాధించి రూ.45,260 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే కాలానికి కంపెనీ ఆదాయం రూ.31,442 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల ప్రభావంతో మంగళవారం స్టాక్ఎక్చేంజీలో టాటా మోటార్స్ షేరు ధర 5.36 శాతం పెరిగి రూ. 272.10 వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలకూ కలిపి నికర ఆదాయం లక్ష కోట్ల రూపాయలను అధిగమించింది.


Click it and Unblock the Notifications









