హైబ్రిడ్ రూట్ను ఎంచుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా
యుటిలిటీ వాహనాల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను ఏర్పరుచుకున్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) కూడా హైబ్రిడ్ వాహనాలపై కన్నేసింది. ఇటు బ్యాటరీ పవర్తోనూ అటు శిలాజ ఇంధనాల (పెట్రోల్, డీజిల్ మొదలైనవి) తోనూ నడిచే వాహనాల తయారీకి మహీంద్రా అండ్ మహీంద్రా శ్రీకారం చుట్టింది.
రానున్న 2015 నాటికి ఈ హైబ్రిడ్ వాహనాలను వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే, ఎమ్ అండ్ ఎమ్ నుండి అధికంగా అమ్ముడవుతున్న స్కార్పియో ఎస్యూవీలో కంపెనీ ఓ హైబ్రిడ్ వేరియంట్ను డిజైన్ చేసి ప్రదర్శనకు ఉంచింది.
చెన్నైలోని ఓరగడం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం (ఆర్ అండ్ డి సెంటర్)లో ఓ యూరోపియన్ కన్సల్టెంట్తబ కూడిన 14 మంది ఇంజనీర్ల బృందం ఈ హైబ్రిడ్ వాహనాల టెక్నాలజీపై నిరంతరం పనిచేస్తూనే ఉందని, ఇందుకోసం తాము రూ.300 కోట్ల పెట్టుబడులను వెచ్చించామని మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో మహీంద్రా అండ్ మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయం ఆహ్వానించదగినదే. అయితే, వీటి లభ్యత అనుకున్న సమయం కన్నా కాస్తంత ముందుగా లభించినట్లయితే బాగుంటుంది. వాస్తవానికి హైబ్రిడ్ వాహనాలు, సాధారణ పెట్రోల్, డీజిల్ కార్ల కన్నా అధిక మైలేజ్ను ఇస్తాయి. అలాగే, వీటి ధర కూడా కాస్తంత అధికంగానే ఉంటుంది.
రానున్న రోజుల్లో ఇలాంటి హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరిగే ఆస్కారం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది. గడచిన 2008లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ఎమ్ అండ్ ఎమ్ హైబ్రిడ్ ప్రోటోటైప్ స్కార్పియో ఎస్యూవిని ప్రదర్శనకు ఉంచింది. కాగా.. ఈ సంవత్సరం జరిగిన ఆటో ఎక్స్పోలో ఎలక్ట్రిక్ వెరిటో సెడాన్ను కూడా డిస్ప్లే చేసింది. ఇండియాలో విడుదలైన మొదటి హైబ్రిడ్ కారు హోండా సివిక్, ఆ తర్వాత టొయోటా ప్రయస్ మార్కెట్లోకి రావటం జరిగింది.


Click it and Unblock the Notifications









