సిఎన్జి వెర్షన్ దోస్త్ను విడుదల చేయనున్న అశోక్ లేలాండ్
ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ అశోక్ లేలాండ్ (హిందూజా గ్రూపుకు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ) జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కంపెనీతో కలిసి, దేశీయ విపణిలో తొలిసారిగా అందిస్తున్న చిన్న తరహా వాణిజ్య వాహనం (లైట్ కమర్షియల్ వెహికల్) 'అశోక్ లేలాండ్ దోస్త్' పికప్ ట్రక్ భారత మార్కెట్లో ప్రవేశించి అప్పుడు ఒక సంవత్సరం గడిచిపోయింది.
ఈ నేపథ్యంలో అశోక్ లేలాండ్ దోస్త్ వారోత్సవాన్ని నిర్వహించిన సందర్భంగా కంపెనీ అధికారులు మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్ర మార్కెట్లోకి సిఎన్జితో నడిచే ‘దోస్త్' పికప్ను ప్రవేశపెట్టనున్నామని పేర్కొన్నారు. సిఎన్జి లభ్యత, కస్టమర్ల డిమాండ్ ఆధారంగా ఈ ఏడాది చివరి త్రైమాసికంలో సిఎన్జి దోస్త్ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేస్తామని అశోక్ లేలాండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఎల్సివి) నితిన్ సేఠ్ వెల్లడించారు.
అశోక్ లేలాండ్ దోస్త్ మార్కెట్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఇందులో 13 రకాల ఫీచర్లను జోడించిన వార్షికోత్సవ లిమిటెడ్ ఎడిషన్ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ స్పెషల్ ఎడిషన్ అశోక్ లేలాండ్ దోస్త్ ధర రూ.4.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది. కంపెనీ ఇప్పటి వరకూ 20,479 దోస్త్ వాహనాలను విక్రయించింది. ప్రస్తుతం నెలకు 3,000 యూనిట్ల ఉత్పత్తి జరుగుతోందని, వచ్చే ఏడాది నెలకు 4,000కు పెంచుతామని కంపెనీ వివరించింది.
దోస్త్ ఎల్సివి 1.25 టన్నుల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో 55 హెచ్పి (హార్స్ పవర్)ల శక్తిని కలిగి ఉండే 3-సిలిండర్, 1.5 లీటర్ సిఆర్డిఐ (కామన్ రైల్ డైరెక్ట్ ఫ్యూయెల్ ఇంజక్షన్)ను అమర్చారు. యూరో-లుక్లో ఉండే దోస్త్ క్యాబిన్ విశాలవంతంగా ఉండి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఈ జేవి పేర్కొంది. దోస్త్ బిఎస్-3, మరియు బిఎస్-4లతో మూడు వేరియంట్లలో లభించనుంది.


Click it and Unblock the Notifications









