ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 శాతం పెంచనున్న ఆడి ఇండియా
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి ఇండియా భారత మార్కెట్లోని లగ్జరీ కార్ విభాగంలో వీలైనంత అధికంగా మార్కెట్ వాటాను దక్కించుకోవాలని భావిస్తోంది. ఇందుకు కంపెనీ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. గురువారం సరికొత్త 2012 వెర్షన్ ఏ4 సెడాన్ను దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన ఆడి ఇండియా, సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు తెలిపింది.
అంతేకాకుండా, భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు ఆడి ఇండియా పేర్కొంది. ఔరంగాబాద్లో ఉన్న ప్లాంటులో త్వరలోనే ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 శాతం మేర (9,000 యూనిట్లకు) పెంచనున్నామని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు. ఇందుకు గానూ కంపెనీ ఓ కొత్త అసెంబ్లింగ్ హాలు (హాల్ సి)ని నిర్మిస్తున్నామని, దీని ద్వారా అధనంగా మరో 3,000 యూనిట్ల ఉత్పత్తిని సాధిస్తామని ఆయన తెలిపారు.
ఔరంగాబాద్ ప్లాంటును తొలుత ఒక షిఫ్టు ప్రాతిపదికన 3,000 యూనిట్లను ఉత్పత్తి చేసేలా నిర్మించారు. ఈ ప్లాంటులో ఏ4, ఏ6, క్యూ5 మోడళ్లను ఆడి ఇండియా అసెంబ్లింగ్ చేస్తుంది. ఇటీవలే ఈ ప్లాంటులో రెండవ షిఫ్టును కూడా ప్రారంభించడంతో ఉత్పత్తి సామర్థ్యం 6,000 యూనిట్లకు పెరిగింది. ఈ కొత్త అసెంబ్లిగ్ హాలును ఏర్పాటు చేయడం ద్వారా అధనంగా మరో 3,000 యూనిట్ల (మొత్తం 9,000 యూనిట్ల)ను ఉత్పత్తి చేస్తామని ఆయన చెప్పారు. దీని ద్వారా ఆడి కార్ల వెయింటిగ్ పీరియడ్ గణనీయంగా తగ్గిపోనుంది.


Click it and Unblock the Notifications









