జూన్లో మిశ్రమ ఫలితాలను కనబరిచిన ఆటో కంపెనీలు
పెరిగిన పెట్రోల్ ధరలు, దిగిరాని వడ్డీ రేట్లు, జోబూచులాడుతున్న రూపాయి మారకపు విలువ.. మొదలైన ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో సైతం దేశీయ ఆటోమొబైల్ రంగం ప్రోత్సాహకర వృద్ధిని కనబరుస్తోంది. గడచిన జూన్ నెలలో భారత ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 8.28 శాతం మేర వృద్ధిని సాధించి 1,55,763 యూనిట్లుగా నమోదయ్యాయి.
క్రితం సంవత్సరం ఇదే కాలానికి మొత్తం కార్ల అమ్మకాలు 1,43,851 యూనిట్లుగా ఉన్నట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంకెల పరంగా జూన్ 2012 నెలలో కార్ల అమ్మకాలు పెరిగినప్పటికీ, గతేడాది పెరుగుదలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువేనని ఎస్ఐఏఎమ్ సీనియర్ డైరెక్టర్ సుగటొ సేన్ తెలిపారు. గత నెలలో మారుతి సుజుకి ఇండియా 70,977 యూనిట్లను విక్రయించగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా 30,363 కార్లను విక్రయించింది.
అయితే, ఇదే సమయంలో ద్విచక్ర వాహన అమ్మకాలు మాత్రం జోరుగా సాగాయి. జూన్ నెలలో మొత్తం మోటార్సైకిల్ అమ్మకాలు సగటున 6.58 శాతం వృద్ధి చెంది 8,25,388 యూనిట్ల నుంచి 8,79,713 యూనిట్లకు పెరిగాయి. హీరో మోటో అమ్మకాల్లో 4.93 శాతం, బాజాజ్ ఆటో 1.25 శాతం వృద్ధిని నమోదు చేసుకుందన్నారు.
ఈ సెగ్మంట్లో మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ జూన్ 2012 అమ్మకాలు 4.93 శాతం వృద్ధితో 4,89,505 యూనిట్లకు చేరాయి. అలాగే బజాజ్ ఆటో అమ్మకాలు 2,11,510 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇకపోతే హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా జూన్ 2012లో మొత్తం 95,315 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. మొత్తమ్మీద జూన్ నెలలో ఆటోమొబైల్ కంపెనీలు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి.


Click it and Unblock the Notifications









