డస్టర్, క్వాంటో, ఈకోస్పోర్ట్లకు పోటీగా ఫోక్స్వ్యాగన్ ఎస్యూవీ
ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో యుటిలిటీ వాహనాలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు వివిధ కార్ కంపెనీలు విభిన్న యుటిలిటీ వాహనాలను ప్రవేశపెట్టగా మరికొన్ని కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ కోవలోనే జర్మనీకు చెందిన కార్ కంపెనీ ఫోక్స్వ్యాగన్ కూడా దేశీయ విపణిలో సరికొత్త యుటిలిటీ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
తాజా మార్కెట్లోకి వచ్చిన రెనో డస్టర్, త్వరలో రానున్న మహీంద్రా క్వాంటో, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవీలను సవాల్ చేస్తూ ఫోక్స్వ్యాగన్ కూడా ఓ సరికొత్త ఎస్యూవీని మార్కెట్లో విడుదల చేయనుంది. వేగంగా వృద్ధి చెందుతున్న ఎమ్యూవీ (మల్టీ యుటిలిటీ వెహికల్స్), ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్, స్మాల్ కార్స్ వంటి విభిన్న సెగ్మంట్లలో ఉత్పత్తులను ప్రవేశపెట్టడం తమ భవిష్యత్ ప్రణాళికలో భాగమని ఫోక్స్వ్యాగన్ ప్రెసిడెంట్, ఎమ్డి గెర్రీ డోరిజాస్ తెలిపారు.
మారుతి సుజుకి ఇండియా ప్రవేశపెట్టిన యుటిలిటీ వాహనం ఎర్టిగా, రెనో ఇండియా విడుదల చేసిన డస్టర్ వాహనాలు మార్కెట్లో ఊహించని రీతిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ను మార్గదర్శకంగా చేసుకొని ఫోక్స్వ్యాగన్ కూడా ఓ కాంపాక్ట్ ఎస్యూవీని విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఫోక్స్వ్యాగన్ ఇండియా దేశీయ విపణిలో 'న్యూ టోరెగ్' లగ్జరీ ఎస్యూవీని మాత్రమే అందిస్తోంది. సిబియూ రూట్లో లభిస్తున్న ఈ ఎస్యూవీ అధిక ధరను కలిగి ఉండటం వలన దీని అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫోక్స్వ్యాగన్ ప్రవేశపెట్టనున్న కాంపాక్ట్ ఎస్యూవీని ఇండియన్ మార్కెట్లోనే అసెంబ్లింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. ఫోక్స్వ్యాగన్ బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అయిన పోలో, వెంటో కార్లలో కంపెనీ సరికొత్త అప్డేటెడ్ వెర్షన్లను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవి పాత వెర్షన్ ధరలతో పోల్చుకుంటే రూ. 30,000 నుంచి రూ. 40,000 తక్కువగా ఉన్నాయి. ఈ నెల మధ్యభాగం నుంచి అప్డేటెడ్ పోలో, వెంటో కార్లు మార్కెట్లో లభ్యం కానున్నాయి. ఇవి టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి.


Click it and Unblock the Notifications









