ఫోర్డ్ ఈకోస్పోర్ట్లో 80 శాతం లోకల్ స్పేర్ పార్టులే..!
అమెరికన్ కార్ మేకర్ ఫోర్డ్ భారత మార్కెట్ కోసం ఓ కాంపాక్ట్ ఎస్యూవీ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్'ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో మార్కెట్లో రానున్న ఈ కాంపాక్ట్ ఎస్యూవీ గురించి ఫోర్డ్ ఇండియా మరిన్ని ఆసక్తికరమైన విషయాలను కంపెనీ వెల్లడించింది.
భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మంట్ను సవాల్ చేస్తూ, పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్తో రానున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవీలో దాదాపు 80 శాతం విడిభాగాలను ఇక్కడి మార్కెట్ నుంచే కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్యూవీ ఉత్పత్తిని ఎక్కువ భాగం లోకలైజేషన్ (స్థానికంగా లభించే విడిభాగాలను ఉపయోగించి ఉత్పత్తిని చేపట్టడం) చేయటం ద్వారా తక్కువ ధరకే దీనిని అందించాలనే ఉద్దేశ్యంతో ఫోర్డ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్లో తమ రెండవ గ్లోబల్ ఎస్యూవీ అని, ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ క్లాసిక్ మోడళ్ల మాదిరిగానే ఇందులో కూడా ఎక్కువగా స్థానికంగా లభ్యమయ్యే విడిభాగాలనే ఉపయోగించనున్నామని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బోన్హామ్ వివరించారు. చెన్నైకు సమీపంలో మరైమలైనగర్లో ఫోర్డ్ ఇండియా ప్లాంటులో ఈ గ్లోబల్ కాంపాక్ట్ ఎస్యూవీని కంపెనీ ఉత్పత్తి చేయనుంది. ఇక్కడ తయారైన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ను సమీప గ్లోబల్ మార్కెట్లకు సైతం కంపెనీ ఎగుమతి చేసే అవకాశం ఉంది.
కాగా.. ఫోర్డ్ ఇండియా గుజరాత్లోని సనంద్లో (టాటా నానో ప్లాంట్ ఉన్న ప్రాంతం) మరో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 2015 నాటికి ఎనిమిది సరికొత్త కార్లను ఇండియాకు పరిచయం చేయాలని ఫోర్డ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ క్లాసిక్ మోడళ్ల ఉత్పత్తిలో దాదాపు 80 శాతం విడిభాగాలను కంపెనీ స్థానికంగానే కొనుగోలు చేస్తుంది.


Click it and Unblock the Notifications









