వాహనాల ధరలను రూ.5,000 మేర పెంచిన హ్యుందాయ్

పెరిగిన ధరలు నవంబర్ 1, 2012వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. పెరిగిన ఇన్పుట్ ధరల వలన ఉత్పత్తుల ధరలు పెంచక తప్పడం లేదని, తమ వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా ఉండేలా ధరల పెంపును కనిష్టం చేసేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (నేషనల్ సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు. హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ ఇయాన్ మొదలు కొని ప్రీమియం ఎస్యూవీ శాంటాఫే వరకూ అన్ని ఉత్పత్తుల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది.
అయితే, ఏయే మోడల్పై ఎంత మేర ధరలు పెంచుతున్నామనే విషయాన్ని మాత్రం కంపెనీ వివరించలేదు. ప్రస్తుతం హ్యుందాయ్ దేశీయ విపణిలో అందిస్తున్న కార్ల ధరలు రూ. 2.75 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి రూ.25.38 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) శ్రేణిలో ఉన్నాయి.
కాగా.. మారుతి సుజుకి ఇటీవలే తమ కార్ల ధరలను మోడల్ను బట్టి రూ.2,500 నుంచి రూ.5,250 మేర ధరలను పెంచగా, జనరల్ మోటార్స్ కూడా రూ.8,000 నుంచి రూ.20,000 మేర ధరలను పెంచిన సంగతి తెలిసిందే. హోండా అందిస్తున్న బ్రయో, జాజ్, సిటీ సెడాన్ ధరలను 2.6 శాతం మేర పెంచింది. అలాగే, రెనో ఇండియా ఇటీవలే ఇండియాలో విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్యూవీ డస్టర్ ధరను రూ.40,000 వరకూ పెంచగా, జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా విడుదల చేసిన ఆడి క్యూ3 లగ్జరీ కాంపాక్ట్ ఎస్యూవీ ధరను సుమారు రూ.50,000 మేర పెంచింది.


Click it and Unblock the Notifications








