కార్ల ధరలను పెంచనున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా
ముడి సరుకులు ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ కార్ల రేట్లను పెంచనున్నామని, పెరిగిన కొత్త రేట్లు మరికొన్ని వారాల్లో అమల్లోకి వస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఏయే మోడల్పై ఎంత మేర ధర పెంచనున్నామనే విషయాన్ని మాత్రం కంపెనీ స్పష్టం చేయలేదు. ధరల పెంపు గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా ఉపాధ్యక్షుడు రాకేశ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ఉత్పత్తుల ధరలను పెంచడానికి ప్రధాన కారణం నానాటికీ పెరగిపోతున్న ముడి పదార్ధాల ధరలు మరియు రవాణా ఛార్జీలేనని చెప్పారు.
ప్రస్తుతం హ్యుందాయ్ దేశీయ విపణిలో అందిస్తున్న కార్ల ధరలు రూ. 2.75 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి రూ.25.38 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) శ్రేణిలో ఉన్నాయి. కాగా.. మారుతి సుజుకి ఇటీవలే తమ కార్ల ధరలను మోడల్ను బట్టి రూ.2,500 నుంచి రూ.5,250 మేర ధరలను పెంచగా, జనరల్ మోటార్స్ కూడా రూ.8,000 నుంచి రూ.20,000 మేర ధరలను పెంచిన సంగతి తెలిసిందే.
హోండా అందిస్తున్న బ్రయో, జాజ్, సిటీ సెడాన్ ధరలను 2.6 శాతం మేర పెంచింది. అలాగే, రెనో ఇండియా ఇటీవలే ఇండియాలో విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్యూవీ డస్టర్ ధరను రూ.40,000 వరకూ పెంచగా, జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా విడుదల చేసిన ఆడి క్యూ3 లగ్జరీ కాంపాక్ట్ ఎస్యూవీ ధరను సుమారు రూ.50,000 మేర పెంచింది.


Click it and Unblock the Notifications









