పెట్రోల్ కార్లకు డిమాండ్ ఫట్.. ఉత్పత్తి కట్..!
పెట్రోల్ కంపెనీలు ఆటోమొబైల్ కంపెనీల షట్టర్లు మూసేసుకునే పరిస్థితికు తీసుకువచ్చాయి. అడ్డూ అదుపు లేకుండా, విచ్చలవిడిగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలను చూసి బెంబేలెత్తిపోతున్న కస్టమర్లు పెట్రోల్ కార్లను కొనేందుకు వెనుకంజ వేయటం, ఫలింతా వీటి డిమాండ్ ఢమాల్ అని క్రిందికి పడిపోవటంతో ఆటోమొబైల్ కంపెనీలు పెట్రోల్ కార్ల ఉత్పత్తులను భారీగా తగ్గించేశాయి.
జపనీస్ కార్ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ తాత్కాలికంగా పెట్రోల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. అలాగే, ఇటాలియన్ కార్ మేకర్ ఫియట్ కూడా వచ్చే నెలలో కొద్ది రోజుల పాటు తమ ఫ్లాంట్ను మూసి వేయాలని నిర్ణయించింది. అంతేకాదు.. దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా కూడా పెట్రోల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసి వార్షిక మెయింటినెన్స్ను నిర్వహించాలని నిర్ణయించింది. టాటా మోటార్స్ సైతం పూనేలోని ప్లాంట్లో వాణిజ్య వాహనాల ఉత్పత్తిని మూడు రోజుల పాటు నిలిపివేసింది.
పెట్రోల్ కార్ల అమ్మకాలు తగ్గిపోవడంతో వీటి స్టాక్ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిందని, కొత్తగా ఉత్పత్తి అయ్యే పెట్రోల్ కార్లను స్టాక్ చేసుకునేందుకు స్థలం కొరత కారణంగా పెట్రోల్ కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (కమర్షియల్) శేఖర్ విశ్వనాథన్ తెలిపారు. లివా, ఎతియోస్, కరోలా ఆల్టిస్ మోడళ్లు టొయోటా నుంచి అత్యధికంగా అమ్ముడయ్యే పెట్రోల్ కార్లు. ప్రస్తుతం వీటి ఉత్పత్తి భారీగా తగ్గి స్టాక్ పెరిగిపోయింది. ప్రస్తుతం కొనుగోలుదారులకు పెట్రోల్ కార్లను తక్షణమే డెలివరీ చేస్తున్నారు.
ఫియట్ ఇండియా కూడా ఇదే తరహాలో పెట్రోల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయనుంది. పెట్రోల్ కార్ల స్టాక్ స్థాయిని తాము పర్యవేక్షిస్తున్నామని, పెట్రోల్ కార్లకు డిమాండ్ తగ్గముఖం పడుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో రెండు-మూడు రోజులు ప్లాంట్ను మూసివేస్తామని ఫియట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో రాజీవ్ కపూర్ వెల్లడించారు. తగ్గిన ప్యాసింజర్ కార్ల డిమాండ్ వాణిజ్య వాహనాల ఉత్పత్తిదారులపై పడుతోందని టాటా మోటార్స్ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 22 నుంచి 24 వరకు పూనేలోని వాణిజ్య వాహనాల ప్లాంట్ను మూసివేస్తున్నామని టాటామోటార్స్ పేర్కొంది.
ఇకపోతే.. ఇండియాలో అత్యధికంగా పెట్రోల్ కార్లను విక్రయించే నెంబర్ వన్ కార్ కంపెనీ మారుతి సుజుకి కూడా ఆల్టో, ఎమ్-800, ఏ-స్టార్ ఎస్టిలో, ఓమ్ని వంటి పెట్రోల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేశామని పేర్కొంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, దిగిరాని బ్యాంకు వడ్డీ ధరలే పెట్రోల్ కార్ల డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణాలు. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు కార్ కంపెనీలు ఈ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను, వివిధ ఆఫర్లను ప్రకటించనున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే, పెట్రోల్ ధరల విషయాన్ని పక్కనుంచి సరసమైన ధరకే పెట్రోల్ కార్లను సొంతం చేసుకోవాలనుకునే వారికి మాత్రమే ఇదే అనువైన సమయం అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications









