మహీంద్రా అండ్ మహీంద్రాపై అమెరికాలో చీటింగ్ కేసు
అమెరికాలోని డియాజ్ ర్యూ అనే సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇక్కడి మార్కెట్లో పలువురు ఆటో డీలర్ల నుంచి ఎమ్ అండ్ ఎమ్ సుమారు 60 మిలియన్ డాలర్ల నగదు సేకరించి జారుకున్నారని తెలిపారు. అమెరికన్ మార్కెట్లో వాహనాలను విక్రయించేందుకు తమ వద్ద తేలికపాటి ట్రక్కులు (లైట్ కమర్షియల్ వెహికల్స్), ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)లు డెలివరీకి సిద్ధంగా ఉన్నాయని నమ్మబలికి వారి నుంచి భారీ మొత్తాలలో నగదును వసూలు చేసుకొని జారుకుందని ఆయన చెప్పారు.
మహీంద్రా గ్రూపు ఇక్కడి డీలర్లకు కావాలనే సర్టిఫికేట్లను జారీ చేయడంలో ఆలస్యం చేసిందని, ఒకరికి తెలియకుండా మరో డీలర్ల నుంచి డబ్బును వసూలు చేసుకున్నారని, ఇది బిజనెస్ సీక్రెట్ మరెవ్వరికీ తెలియకూడదనే షరతును కూడా మహీంద్రా అండ్ మహీంద్రా విధించిందని డీలర్లు తెలిపారు. ఇది ఖచ్చితంగా మోసపూరిత చర్యేనని ఆయన అన్నారు. కాగా.. దీనిపై స్పందించేందుకు మాత్రం ఎమ్ అండ్ ఎమ్ నిరాకరించింది.
ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది కాబట్టి, దీనిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని మహీంద్పా అండ్ మహీంద్రా పేర్కొంది. అట్లాంటాలో జూన్ 4వ తేదీన న్యూహాంపైర్స్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్లకు చెందిన వివిధ డీలర్లు ఎమ్ అండ్ ఎమ్పై కోర్టులో దావా వేశారు. వీరు తమ దేశంలో డీలర్షిప్కు కావాల్సిన రుసుము చెల్లించడంతో పాటుగా, మహీంద్రా తరఫున మార్కెటింగ్ కార్యకలాపాలను కూడా ప్రారంభించారు.
కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే షోరూమ్లను కూడా ఏర్పాటు చేసుకుని, డిస్ప్లే ఫ్లాట్ఫామ్తో పాటుగా అదనపు సిబ్బందిని సైతం నియమించుకున్నారు. ఇవన్నీ కూడా మహీంద్రా అండ్ మహీంద్రా ప్రోద్బలంతోనే తాము చేపట్టామని డీలర్లు అంటున్నారు. 2008 నాటికి తమ ఉత్పత్తులు అమెరికన్ మార్కెట్లో అందుబాటులోకి వస్తాయని ఎమ్ అండ్ ఎమ్ హామీ ఇచ్చిందని వారు ఆరోపిస్తున్నారు.


Click it and Unblock the Notifications









