మహీంద్రా ఎక్స్యూవీ500 విదేశీ ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తి
ఎస్యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) నుండి దేశీయ విపణిలో లభిస్తున్న గ్లోబల్ మోడల్ "ఎక్స్యూవీ500" స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) ఇక్కడి మార్కెట్లో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఉత్పత్తికి మించిన డిమాండ్, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువైనా తగ్గని క్రేజ్లతో ఎక్స్యూవీ500 దూసుకుపోతుంది. దీని ఆకర్షనీయమైన ధర, నాణ్యమైన ప్రపంచ స్థాయి ఫీచర్లతో ఇది ధరకు తగిన వెలను కలిగి ఉండటం కూడా ఇందుకు మరొక కారణంగా చెప్పుకోవచ్చు.
కాగా.. ఇప్పుడు గ్లోబల్ మోడల్ను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకువెళ్లేందుకు ఎమ్ అండ్ ఎమ్ సన్నాహాలు చేస్తుంది. వాస్తవానికి ఎప్పుడో ఈ మోడల్ను అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయాల్సి ఉండగా, దేశీయ మార్కెట్లో ఈ మోడల్కు పెరుగుతున్న డిమాండును దృష్టిలో ఉంచుకొని, దీని విడుదలను కంపెనీ వాయిదా వేసుకుంది. అయితే, ఎక్స్యూవీ500 ఎస్యూవీని గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయటం మరింత ఆలస్యం చేసినట్లయితే, అక్కడి మార్కెట్లలో నిలదొక్కుకోవటం కష్టమవుతుంది.
ఈ నేపథ్యంలో మహీంద్రా ఎక్స్యూవీ500 ఎస్యూవీని ఇటలీ, ఆస్ట్రేలియా, చిలీ దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆయా దేశాల పరిస్థితులకు అనుగుణంగా ఈ మోడల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని ఎమ్ అండ్ ఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఇంటర్నేషనల్ ఆపరేషన్) రుజిబిన్ ఇరానీ తెలిపారు.
ఇటలీ మార్కెట్ కోసం కర్బన ఉద్గారాల విడుదలను అక్కడి పరిమితులకు లోబడి ఉంచడంతోపాటు ఎడమ చేతి వాటం డ్రైవింగ్, ఇంటీరియర్లో మార్పులు తదితర అంశాలను పూర్తి చేశామని ఆయన తెలిపారు. దేశీయ మార్కెట్ డిమాండ్ను తీర్చడంతో పాటుగా గ్లోబల్ మార్కెట్ అవసరాలను కూడా తీర్చాలనే ఉద్దేశ్యంతో ఎక్స్యూవీ500 ఉత్పత్తి నెలకు 3,000 యూనిట్ల నుండి 5,000 యూనిట్లకు పెంచునున్నామని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications









