లక్ష యూనిట్ల అమ్మకాల మార్కును తాకిన మహీంద్రా జైలో
ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న బహుళ ప్రయోజన వాహనం (మల్టీ పర్పస్ వెహికల్) 'మహీంద్రా జైలో' మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహీంద్రా జైలో దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ లక్ష యూనిట్లకు పైగా అమ్ముడుపోయి సరికొత్త రికార్డును సృష్టించింది.
ఈ మొత్తం అమ్మకాలలో గడచిన ఆర్థిక సంవత్సరంలోనే 26,252 యూనిట్లు అమ్ముడయ్యాని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎమ్ అండ్ ఎమ్ 2009లో మహీంద్రా జైలో ఎమ్పివిని మార్కెట్లో విడుదల చేసింది. కాగా.. ఈ ఏడాది ఆరంభంలో జైలో ఎమ్పివిలో ఓ సరికొత్త రిఫ్రెష్డ్, అప్గ్రేడెడ్ వేరియంట్ను కంపెనీ విడుదల చేసింది. పాత జైలోతో పోల్చుకుంటే అనేక మార్పులతో వచ్చిన కొత్త జైలోకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది.
ఇక సరికొత్త మహీంద్రా జైలో ఎమ్పివి విషయానికి వస్తే.. పాత జైలోతో పోల్చుకుంటే దాదాపు 50 మార్పులతో ఈ ఎమ్పివిని రూపొందించడం జరిగింది. 2012 వెర్షన్ జైలో ఎమ్పివి డి2, డి4, ఈ4, ఈ8, ఈ9 అనే ఐదు వేరియంట్లలో, ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభించనుంది. హైదరాబాద్ మార్కెట్లో కొత్త జైలో ధరలు రూ.7.37 లక్షల నుండి రూ.10.24 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇది మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.
కొత్త మహీంద్రా జైలో ఈ9 వేరియంట్లో స్కార్పియోలో ఉపయోగించే 2.2లీటర్ ఎమ్హాక్ ఇంజన్ను ఉపయోగించారు, ఇది 120 బిహెచ్పిల శక్తిని, 290 ఎన్ఎమ్ల టార్క్ను విడుదల చేస్తుంది. అలాగే, ఈ4, ఈ8 వేరియంట్లలో ఉపయోగించిన 2.5 లీటర్ ఎమ్ఈగల్ ఇంజన్ 112 బిహెచ్పిల శక్తిని, డి2, డి4 వేరియంట్లలో ఉపయోగించిన ఎమ్డిఐ ఇంజన్ 95 బిహెచ్పిల శక్తిని విడుదల చేస్తుంది. ఐదు వేరియంట్లలో లభ్యమయ్యే కొత్త జైలో ఎమ్పివి వేరియంట్ను బట్టి లీటరుకు 13-15 కి.మీ. మైలేజీనిస్తుంది.


Click it and Unblock the Notifications








