బడ్జెట్ విడుదలైన తర్వాతనే మారుతి ఎర్టిగా విడుదల
ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో యుటిలిటీ వాహన విభాగం జోరందుకోవడంతో ఈ విభాగంలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ అవకాశాలను చేజిక్కుంచుకునేందుకు ఎర్టిగా ఆవిష్కరిణతో తొలిసారిగా ఎమ్పివి సెగ్మెంట్లో ప్రవేశించిన దేశపు అగ్రగామి ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా "ఎర్టిగా"ను మార్కెట్లో విడుదల చేసే అంశంపై ఆచితూచి అడుగులు వేస్తుంది.
మరికొద్ది రోజుల్లో యూనియన్ బడ్జెట్ 2012 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ రంగంపై కేంద్ర బడ్జెట్ 2012లో ప్రభుత్వం ప్రకటించే నిర్ణయం కోసం ఆటోమొబైల్ కంపెనీలన్నీ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే డీజిల్ కార్లపై అధిక సుంఖాలు విధించాలని ప్రతిపాదనలు రావటం, వీటి పట్ల ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందన్న వార్తలు రావడంతో ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళనలో పడుతున్నాయి.
ముఖ్యంగా మారుతి సుజుకి ఈ నెలలో మార్కెట్లోకి ప్రవేశ పెట్టదలచిన ఎర్టిగా ఎమ్పివి, ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ 2012ను ప్రకటించిన తర్వాత మార్కెట్లోకి వాణిజ్యపరంగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందుకు ప్రధాన కారణం రానున్న బడ్జెట్లో డీజిల్ కార్లపై అదనపు సుంఖాలను, 2 శాతం అధిక వ్యాట్ను విధించాలని ప్రభుత్వం యోచిస్తుండటమే. ఇదే గనుక జరిగితే కార్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావటం ఖాయం.
ఈ పరిస్థితులను అధ్యయనం చేసిన మారుతి సుజుకి, బడ్జెట్ 2012 విడుదల కాకముందే ఎర్టిగాను విడుదల చేసినట్లయితే, బడ్జెట్ అనంతరం మరోసారి ఈ మోడల్ ధరలను సవరించాల్సి వస్తుందని, ఎర్టిగా విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈనెల 16న కేంద్ర బడ్జెట్ 2012ను ప్రభుత్వం ప్రకటించినుంది కాబట్టి, మార్చి నెలాఖరులోగా మనం ఎర్టిగా ఎమ్పివి విడుదలను అంచనా వేయవచ్చు.


Click it and Unblock the Notifications








