ఈ ఆర్థిక సంవత్సరంలో మా ఎగుమతులు పడిపోవచ్చు: మారుతి
ప్రపంచ మార్కెట్లు నెమ్మదిగా సాగుతున్న నేపథ్యంలో, భారతదేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) 2012-13 ఆర్థిక సంవత్సరంలో తమ ఉత్పత్తుల ఎగుమతలు ఆశించినంతగా సాగబోవని పేర్కొంది. "ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు ప్రోత్సాహకరంగా ఉడంబోవు. గడచిన సంవత్సరం కన్నా ఇవి తక్కువగా నమోదయ్యే ఆస్కారం ఉంది. అనేక ప్రపంచ మార్కెట్లలో పరిస్థితి ఇంకా సద్దుమణగలేద"ని కంపెనీ ఛైర్మన్ ఆర్.సి. భార్గవ వెల్లడించారు.
మార్చి 31, 2012తో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి 1,27,379 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 7.9 శాతం తక్కువ. యూరప్, లాటిన్ అమెరికా, పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆసియా దేశాలకు మారుతి సుజుకి తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఏదేమైనప్పటికీ, 2012-13 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 10 శాతం మేర వృద్ధి చెందే ఆస్కారం ఉందని అంచనా వేస్తోంది.
ముఖ్యంగా డీజిల్ కార్ల అమ్మకాల వలన ఈ వృద్ధిని సాధించగలమని కంపెనీ పేర్కొంది. 2011-12లో కంపెనీ మొత్తం అమ్మకాలు 10.8 శాతం పడిపోయి 11,33,695 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదివరకటి ఆర్థిక సంవత్సరంలో ఇవి 12,71,005 యూనిట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications









