మారుతి సుజుకిలో పెరిగిన జపాన్ సుజుకి వాటా
దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ)లో దాని మాతృ సంస్థ జపాన్కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ వాటా మరింత పెరిగింది. సుజుకి పవర్ట్రెయిన్ ఇండియాను (ఎస్పిఐఎల్) తమలో విలీనం చేసుకోవటంతో ఎమ్ఎస్ఐలో సుజుకి వాటా 56.2 శాతానికి పెరిగింది.
ఈ విలీనానం తర్వాత వాటాల్లో మార్పునకు బోర్డు డైరెక్టర్లు కూడా గ్రీన్ సిగ్నల్ ప్రకటించారని మారుతి సుజుకి ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఎస్పిఐఎల్లో సుజుకి మోటార్స్కు 70 శాతం వాటా ఉంది. ఈ విలీనం తరువాత 13.17 మిలియన్ వాటాలను తాజాగా జారీ చేసేందుకు ప్రతిపాదించామని ఎమ్ఎస్ఐ తెలిపింది.

మారుతి సుజుకి ఇండియా తయారు చేసే కార్లలో ఉపయోగించే డీజిల్ ఇంజన్లను సుజుకి పవర్ట్రెయిన్ ఇండియా సప్లయ్ చేస్తుంది. ఇది జపాన్కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ (మారుతి మాతృ సంస్థ)కు అనుబంధ కంపెనీ. ఈ విలీనం వార్త వెలువడగానే బిఎస్ఇలో సంస్థ ఈక్విటీ వాటా విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 1.14 శాతం పెరిగి 1,121.90 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
మారుతి సుజుకి ఇండియాలో సుజుకి వాటా పెరిగే కొద్దీ ఇందులో మారుతి నియంత్రణ మెల్లిగా తగ్గుముఖం పడుతుంది. ఒకరంగా చెప్పాలంటే, మారుతి యాజమాన్య నియంత్రణ తన జపాన్ భాగస్వామి సుజుకి చేతిలో ఉంది. జపానీ కార్ మేకర్ సుజుకి మోటార్ కార్పోరేషన్ ఇలా మారుతి సుజుకి జేవీలో తన వాటాను పెంచుకుంటూ పోతే భవిష్యత్తులో మారుతి పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.


Click it and Unblock the Notifications








