భారీ భద్రతతో మానేసర్ ప్లాంట్ను రీఓపెన్ చేయనున్న మారుతి
ఇందుకు హర్యానా ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్లాంటులో మరోసారి ఇదివరకటి లాంటి అల్లర్లు జరగకుండా ఉండేలా చూసుకునేందుకు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటామని హర్యానా సర్కారు హామీ ఇచ్చింది. మానేసర్ ప్లాంటును తిరిగి ప్రారంభించాలంటే, పోలీసుల సహకారం తప్పనిసరని కంపెనీ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం మారుతి సుజుకి యాజమాన్యం నిర్వహించిన ఓ సమావేశంలో ఈ మేరకు కంపెనీ బోర్డు డైరెక్టర్లు హర్యానా ప్రభుత్వానికి ఓ లేఖను రాసినట్లు సమాచారం.
గత నెల మూడవ వారంలో మానేసర్ ప్లాంటులో చోటు చేసుకున్న అల్లర్లలో సుమారు 100 మందికి పైగా కార్మికులకు సంబంధం ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ అల్లర్ల కారణంగా మానేసర్ ప్లాంటులో భారీగా ఆస్తి నష్టం జరగటమే కాకుండా, కంపెనీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) మరణానికి కూడా దారి తీసింది. అంతేకాకుండా, ఈ గొడవల్లో అనేక మంది కంపెనీ సిబ్బంది కూడా గాయాలపాలయ్యారు.
మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్లో మొత్తం 3000 మంది శాశ్వత ఉద్యోగులు, 2,800 మంది తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ప్లాంటును పునఃప్రారంభించాలని కంపెనీ నిర్ణయిస్తే, ఈ ప్లాంట్ చుట్టూ భద్రతా బలగాలను మోహరింపచేయాలని హర్యానా ప్రభుత్వం సైతం భావిస్తోంది. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ వివరించారు. ఇదిలా ఉండగా, మానేసర్ ప్లాంట్ మూతపడిన కారణంగా, ఈ ప్లాంటులో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో రానున్న రోజుల్లో కంపెనీ అమ్మకాలు మందగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని పోటీదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications









