ఆగస్ట్ 21 నుంచి మారుతి మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి షురూ
మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో జులై 18న కార్మికులకు, సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 100 మందికి పైగా గాయపడగా, కంపెనీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) అవనిష్ కుమారు దేవ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో జులై 21 నుంచి మానేసర్ ప్లాంట్ను లాకౌట్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మళ్లీ సరిగ్గా నెల రోజుల తర్వాత ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానుంది.
మానేసర్ ప్లాంట్ పునఃప్రారంభం గురించి మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ మాట్లాడుతూ.. కార్మికుల దాడిలో గాయపడిన కంపెనీ సిబ్బంది అంతా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని, అందులో కొంత మంది తిరిగి పనిలోకి చేరారని చెప్పారు. ఈ అల్లర్లకు సంబంధించి విచారణ కొనసాగుతుందని, మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు.
మానేసర్ అల్లర్లతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన 500 మంది శాశ్వత కార్మికులను మారుతి సుజుకి యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. ఈ ప్లాంటులో సుమారు 3,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు 1600 శాశ్వత కార్మికులు. భారీ భద్రతా బలగాల మధ్య కంపెనీ ఈ ప్లాంట్ను పునఃప్రారంభించనుంది. ఈ ప్లాంటులో రోజుకు 150 కార్లను తయారు చేయనున్నారు.
మానేసర్ ప్లాంట్లో ప్రతిరోజు సుమారు 1,700 కార్లు ఉత్పత్తి అవుతాయి. ఇందులో ఎక్కువ భాగం స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ మోడళ్లే ఉంటాయి. మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడయ్యే ఈ రెండు మోడళ్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో కొనుగోలుదారులు ఇదే సెగ్మెంట్లోని ఇతర కంపెనీలు అందిస్తున్న మోడళ్లను కొనుగోలు చేస్తున్నారు. మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి ఆగిపోయిన కారణంగా కంపెనీ రోజుకు సుమారు 80-90 కోట్ల రూపాయల చొప్పున నష్టపోయినట్లు అంచనా.
ఏదేమైనప్పటికీ, ఈ ప్లాంటులో మారుతి సుజుకి స్విఫ్ట్, స్విఫ్ట్ కార్ల ఉత్పత్తి తిరిగి ప్రారంభమైనప్పటికీ, వీటి వెయిటింగ్ పీరియడ్ మాత్రం అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ ముందుగా బుక్ చేసుకున్న వారికే ముందుగా డెలివరీ చేయనుంది. ఇప్పటికే స్విఫ్ట్ కార్లకు చాంతాడంత బుకింగ్ల లిస్ట్ ఉంది. కొత్తగా స్విఫ్ట్ కారును సొంతం చేసుకోవాలనుకునే వాళ్లు కనీసం 4-6 నెలల సమయం వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications









