మానేసర్లో ప్లాంటులో ఉత్పత్తిని పెంచనున్న మారుతి
అయితే, సెప్టెంబర్ నెలాఖరు లోపుగా మనేసర్లోని ప్లాంటులో పూర్తిస్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని, ఈలోపు కొత్త ఉద్యోగుల నియామకాలు కూడా పూర్తవుతాయని మారుతి సుజుకి ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎస్ మైత్రా తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియను ప్రారంభించామని, మరో పది రోజుల్లో కొత్త నియామకాలను కూడా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
కొత్తగా నియమించుకునే కార్మికులకు త్వరలోనే శిక్షణ కూడా ఇవ్వనున్నామని మైత్రా తెలిపారు. ఏసిఎమ్ఏ (ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలను మీడియాకు వివరించారు. గతంలో ఈ ప్లాంట్లో 3,300 మంది కార్మికులు పనిచేస్తుండగా ఇప్పుడు కేవలం 1300-1400 మంది కార్మికులతోనే కంపెనీ పనులు సాగిస్తోంది.
అల్లర్లకు ముందు ఈ ప్లాంటులో రోజుకు 1,700 కార్లు ఉత్పత్తి అయ్యేవి. కాగా.. ప్రస్తుతం ఈ ప్లాంటులో రోజుకు 581 కార్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. సెప్టెంబర్ నెల ప్రథమార్థం నాటికి ఈ ప్లాంటులో రోజుకు 800-850 కార్లను తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మానేసర్ ప్లాంటులో స్విఫ్ట్ డిజైర్, స్విఫ్ట్, ఎస్ఎక్స్ 4, ఎ-స్టార్ మోడళ్లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.


Click it and Unblock the Notifications









