త్వరలో కార్ల ధరలను పెంచనున్న మారుతి సుజుకి
మీరు మారుతి సుజుకి కార్లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఇదే అనువైన సమయం. మరికొద్ది రోజులు ఆలస్యం చేసినట్లయితే, ప్రస్తుత ధర అధిక ధర చెల్లించి కార్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. పెరుగుతున్న ఉత్పాదక వ్యయం దోబూచులాడుతున్న విదేశీ మారకపు విలువలను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే ఉత్పత్తుల ధరలను పెంచుతాని దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) ఓ ప్రకటనలో పేర్కొంది.
"విదేశీ మారకపు విలువలు, పెరుగుతున్న ఉత్పాదక వ్యయాల కారణంగా మా మార్జిన్లపై తీవ్ర వత్తిడి ఏర్పడుతోంది. మరో వారం లోపుగా మా ఉత్పత్తుల ధరలను పెంచనున్నాం. అయితే, ఎంత మేర పెంచనున్నామనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామ"ని మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీక్ తెలిపారు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ తాజా ధరల పెంపు 2 శాతం వరకు ఉండొచ్చని అంచనా.
దేశీయ విపణిలో మారుతి సుజుకి తమ చిన్న కారు ఎమ్800 మొదలుకొని లగ్జరీ సెడాన్ కిజాషి వరకూ, అన్ని వర్గాల వారికి వివిధ రకాల ఉత్పత్తులను ఆఫర్ చేస్తుంది. భారత మార్కెట్లో మారుతి సుజుకి కార్ల ధరలు రూ.2.04 లక్షల నుంచి రూ.17.5 లక్షల రేంజ్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. చిన్న కార్ ప్రియులను, మద్యతరగతి కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ అభివృద్ధి చేసిన సరికొత్త ఆల్టో 800 కారును వచ్చే నెలలో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications









