మానేసర్ ప్లాంట్ ఎఫెక్ట్: క్షీణించిన మారుతి సుజుకి లాభాలు

బలహీనంగా ఉన్న మార్కెట్ సెంటిమెంట్, తగ్గుముఖం పట్టిన అమ్మకాలు, మానేసర్ ప్లాంట్లో చెలరేగిన హింసాకాండ, పెట్రోల్ కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు వాటిపై ఇచ్చిన నగదు తగ్గింపులు/ప్రోత్సాహకాలు, రూపాయి మారకపు విలువ వంటి పలు కారణాల వలన తమ నికర లాభం తగ్గిందని కంపెనీ తెలిపింది. అయితే, ఇదే సమయంలో సంస్థ నికర అమ్మకాలు మాత్రం 9 శాతం వృద్ధిని సాధించి రూ.7,436 కోట్ల నుంచి రూ.8.070 కోట్లకు పెరిగాయని తెలిపింది.
గడచిన ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 2,52,307 వాహనాలను విక్రయించగా, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 2,30,376 వాహనాలు మాత్రమే అమ్ముడుపోయి 9 శాతం క్షీణతను నమోదు చేసిందని కంపనీ వివరించింది. ఇకపోతే కంపెనీ ఎగుమతులు కూడా 29,901 యూనిట్ల నుంచి 20,422 యూనిట్లకు పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఒక్కో కారుకు సగటున రూ.14,750 డిస్కౌంట్ను ఆఫర్ చేయటం కూడా కంపెనీ ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపిందని మారుతి సుజుకి పేర్కొంది.
మారుతి సుజుకి తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త ఆల్టో 800 కారు అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో పాటుగా, ప్రస్తుత పండుగ సీజన్లో కార్ల అమ్మకాలు పుంజుకునే ఆస్కారం ఉందని, రానున్న త్రైమాసికాల్లో మంచి ఫలితాలని సాధించగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications








