అక్టోబర్ నెలలో కొత్త ఆల్టో 800ని విడుదల చేస్తాం: మారుతి
దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) నుండి ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్న సరికొత్త చిన్న కారును విడుదల ఖరారయ్యింది. వాస్తవానికి ఈనెలలోనే కొత్త ఆల్టో 800 కారు మార్కెట్లోకి రావల్సి ఉండగా, మారుతి సుజుకి సంస్థలో నెలకొన్న కార్మిక అనిశ్చితి కారణంగా దీని విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
అయితే, ఎట్టిపరిస్థితుల్లోను ఈ కారును వచ్చే నెలలో మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది. మారుతి సుజుకి ఇటీవలి కాలంలో వివిధ కారణాల వలన తన మార్కెట్ వాటాను భారీగా కోల్పోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో, కోల్పోయిన తన మార్కెట్ వాటాను సరికొత్త ఆల్టో 800 కారు ద్వారా తరిగి దక్కించుకోవాలని మారుతి సుజుకి యోచిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 'ఆల్టో' స్థానంలో కొత్త 'ఆల్టో 800' కారును వచ్చే నెలలో (మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ 16, 2012) మార్కెట్లోకి తీసుకువస్తామని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇందులో సిఎన్జి వేరియంట్ను అందుబాటులోకి తీసుకురానున్నామని మారుతి సుజుకి ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మార్కెట్ విభాగం) మనోహర్ భట్ తెలిపారు.
కొత్త ఆల్టో 800తో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కంపెనీ చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు. ఈ కొత్త కారును డిజైన్ చేయటం కోసం కంపెనీ రూ.470 కోట్లను వెచ్చించిందని, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆల్టో డిజైన్ను ఆధారంగా చేసుకొనే, కొత్త ఆలో 800ను రూపొందించామని, ఇది లీటరు పెట్రోల్కు 22.74 కి.మీ. మైలేజీనిస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం లభిస్తున్న ఆల్టోతో పోల్చుకుంటే కొత్త ఆల్టో 800 మైలేజ్ 15 శాతం అధికం.


Click it and Unblock the Notifications









