మంచి భవిష్యత్తు కోసం బెంజ్ నుంచి భారీ పెట్టుబడులు
రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.850 కోట్ల నిధులను కేటాయించామని, అక్టోబర్ 2012 లోపు మహారాష్ట్రలోని ఛాక్కన్లో ఏర్పాటు చేసిన కొత్త పెయింట్ షాప్లో పనులు ప్రారంభమవుతాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ టి హోనెగ్ తెలిపారు. భారత్లో లగ్జరీ కార్ల అమ్మకాలు జోరుగా సాగుతన్నాయని, భవిష్యత్తులోను ఈ ట్రెండ్ ఇలానే కొనసాగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఛాక్కన్లో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్లో సి క్లాస్, ఈ క్లాస్, ఎస్ క్లాస్ కార్లను కంపెనీ అసెంబ్లింగ్ చేస్తోంది. ఉత్పత్తుల ధరలను అందుబాటులో ఉంచేందుకు గాను రానున్న రోజుల్లో మరిన్ని మోడళ్లను ఇక్కడ అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.
ప్రస్తుతం దేశీయ విపణిలో తక్కువ ధర కలిగిన కాంపాక్ట్ లగ్జరీ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా బి-క్లాస్ హ్యాచ్బ్యాక్ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ దీపావళి నాటికి బుల్లి మెర్సిడెస్ బెంజ్ కారు ఇండియన్ మార్కెట్లో హల్ చల్ చేయనుంది.


Click it and Unblock the Notifications









