ఆగస్టులో మార్కెట్లోకి రానున్న నిస్సాన్ ఎమ్పివి 'ఎవాలియా'

గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్పో 2012లో కంపెనీ ఎవాలియా ఎమ్పివీను తొలిసారిగా భారతీయులకు పరిచయం చేసింది. ఇటు వాణిజ్య ప్రయోజనాల కోసం అటు వినియోగదారుల వ్యక్తిగత రవాణా అవసరాలను తీర్చడంలో ఎవాలియా చక్కగా సరిపోతుంది. తరచూ దూర ప్రయాణాలు చేసేవారు, పెద్ద కుటుంబం కలిగిన వారికి నిస్సాన్ ఎవాలియా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
నిస్సాన్ గ్లోబల్ మార్కెట్లో అందిస్తున్న 'ఎన్వీ 200' ఎమ్పివి మోడల్ ఆధారంగా ఎవాలియాను డిజైన్ చేయడం జరిగింది. భారతీయుల టేస్ట్కు అనుగుణంగా ఈ మోడల్ ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ ఉండనున్నాయి. ఇదే వాహనాన్ని భారత్లోని ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ కూడా తమ స్వంత బ్రాండింగ్తో పేరు మార్చి "అశోక్ లేలాండ్ స్టయిల్" అనే పేరుతో మార్కెట్ చేయనుంది.
ఇప్పటికే నిస్సాన్-అశోక్ లేలాండ్ జాయింట్ వెంచర్ నుండి ఓ చిన్న తరహా వాణిజ్య వాహణం (ఎల్సివి) అశోక్ లేలాండ్ దోస్త్ మార్కెట్లోకి విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో నిస్సాన్ మైక్రా, సన్నీ మోడళ్లను మాత్రమే భారత్లో ఉత్పత్తి చేస్తుంది. ఇవికాకుండా ఎక్స్-ట్రైల్ ఎస్యూవీ, టియానా సెడాన్, 370 జెడ్ స్పోర్ట్స్ కార్లను సిబియూ రూట్లో దిగుమతి చేసుకుని విక్రయిస్తుంది. ఎవాలియాను కూడా చెన్నైలోని ఓరగడం ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది.


Click it and Unblock the Notifications








