వందేళ్లు పూర్తి చేసుకున్న నిజామ్ రోల్స్ రాయిస్ సిల్వర్ ఘోస్ట్
నిజాంను పరిపాలించిన '7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా' 1911వ సంవత్సరంలో గ్రేట్ బ్రిటన్లో తయారైన ఈ కారును భారత్కు దిగుమతి చేయించుకున్నారు. ఇది ఇండియాలోనే మొట్టమొదటి రోల్స్ రాయిస్ సిల్వర్ ఘోస్ట్ కారు. ప్రస్తుతం ఈ కారు హైదరాబాద్లోని చౌమహల్లా ప్యాలెస్లో ఉంది. వేడుకలు, ఉత్సవాలకు మాత్రమే ఉపయోగించే ఈ కారు గడచిన 100 ఏళ్లలో కేవలం 356 మైళ్లు మాత్రమే ప్రయాణించి ఉంది.
ఈ కారు ఇండియాకు వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చౌమహల్లా ప్యాలెస్లో రోల్స్ రాయిస్ కారు కోసం శతాబ్ది ఉత్సవాలను 7 ఫిబ్రవరి 2012న ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోడలు ప్రిన్సెస్ ఇజ్రా జహాన్, ఆమె కుమారుడు ప్రిన్స్ ఆజంజా బహదూర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి రోల్స్ రాయిస్ సిల్వర్ ఘోస్ట్ కారు గ్యాలరీని ప్రారంభించి, కేక్ కట్ చేశారు.
రాయల్ ఎల్లో కలర్లో పెయింట్ చేయబడిన ఈ కారు ప్రస్తుతం సుమారు 40 లక్షల అమెరికన్ డాలర్లకు పైగా వెల పలకవచ్చని అంచనా. ఈ రోల్స్ రాయిస్ సిల్వర్ ఘోస్ట్ కారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని ప్రిన్సెస్ ఇస్రా జహాన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్, చౌమల్లా ప్యాలెస్ను వింటేజ్ ఆటోమోటివ్ డెస్టినేషన్ మార్చాలాని భావిస్తున్నామని ఇస్రా అన్నారు.
రాజస్థాన్ కు చెందిన మన్విందర్ సింగ్ ఈ కారుకు మరిన్ని హంగులు అద్దారని, 2011లో ఢిల్లీలో జరిగిన ఎలిగెన్స్ కార్ షోలో ఈ రోల్స్ రాయిస్ కారుకు బెస్ట్ ఆఫ్ క్లాస్, బెస్ట్ ఆఫ్ షో ఎలిగెన్స్ బహుమతులు లభించాయని ఆమె తెలిపారు. ముంబైలో జరగనున్న వింటేజ్ కార్ల పోటీలకు నిజాం నవాబులు వాడిన 106 సంవత్సరాల నాఫియర్ కారు, మరో పురాతన కారును పంపనున్నామని ఆమె అన్నారు.


Click it and Unblock the Notifications









