పెట్రోల్ ధరల ఎఫెక్ట్: ఉత్పత్తిని తగ్గిస్తున్న తయారీదారులు

ద్విచక్ర వాహనాలకు డిమాండ్ తగ్గి అమ్మకాలు తగ్గడంటో వాటి తయారీదారులు ఉత్పత్తిని కూడా తగ్గిస్తున్నారు. ఈ పరిస్థితులకు తోడు ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి ద్విచక్ర వాహనాల తయారీదారులను కలవరానికి గురి చేస్తోంది. దీంతో తయారీదారులు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, గడచిన మూడున్నరేళ్ళలో ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తిని కుదించుకోవటం ఇదే మొదటి సారి.
ఇటీవల పెరిగిన వడ్డీ రేట్లు, విచ్చల విడిగా పెరుగుతున్న పెట్రోల్ ధరలే మార్కెట్ ట్రెండ్ను దెబ్బతీయడానికి కారణమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యాలను తగ్గించడం ద్వారా పెట్టుబడులను ఏకాస్త మేరకైనా సమీకరించుకోగలుగుతామనేది తయారీదారుల ఆలోచనగా తెలుస్తోంది. 2009 జనవరి తరువాత ఈ ఆగస్టులో మొదటిసారిగా మోటార్సైకిళ్ళ విక్రయాలు 8.46 క్షీణతను నమోదు చేశాయి.
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు మొదలుకొని చిన్న తరహా కంపెనీల వరకూ అన్ని తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకున్నట్లు సియామ్ వెల్లడించిన గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇందులో హీరో మోటోకార్ప్ 14 శాతం ఉత్పత్తిని తగ్గించగా, బజాజ్ ఆటో 11.8 శాతం మేర తగ్గించాయి. అయితే, టూవీలర్ మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన హోండా మోటార్సైకిల్, రాయల్ ఎన్ఫీల్డ్, సుజుకి మోటార్సైకిల్ కంపెనీలు మాత్రం ఈ పరిస్థితిని చక్కగా ఎదుర్కుంటున్నాయి.


Click it and Unblock the Notifications








