ఇటలీ భూకంప బాధితుల కోసం ఫెరారీ ఆర్థిక సాయం
గడచిన మే 20న ఇటలీలో సంభవించిన 5.8 మాగ్నిట్యూడ్ తీవ్రత కలిగిన భూకంపం కారణంగా నిరాశ్రయులైన బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ స్పోర్ట్స్ కార్ కంపెనీ ఫెరారీ ముందుకు వచ్చింది. ఫెరారీ తమ వద్ద ఉన్న అరుదైన వస్తువులను వేలం వేయటం ద్వారా సేకరించే సొమ్మును ఇటలీ భూకంప బాధితులకు విరాళంగా ఇవ్వనున్నామని కంపెనీ పేర్కొంది.
జూన్ 4వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకూ నిర్వహించనున్న ఈ ఆన్లైన్ వేలంలో 1.3 మిలియన్ యూరోల విలువైన (మనదేశ కరెన్సీలు సుమారు రూ.8.97 కోట్లు) ఫెరారీ 599ఎక్స్ఎక్స్ ఇవో కారుతో పాటుగా కొన్ని అరుదైన ఫార్ములా 1 (ఎఫ్1)కు చెందిన వస్తువులకు గ్లోబల్ ఆక్షన్ నిర్వహించనున్నామని ఫెరారీ పేర్కొంది. ఫెరారీ డ్రైవర్లు ఆలోన్సో, ఫెలిప్ మాసాలకు చెందిన హెల్మెట్లు, రేసింగ్ యూనిఫామ్లను కూడా ఈ వేలంలో ఉంచనున్నారు.
అత్యుత్తమ ఫెరారీ టెక్నాలజీని ఉపయోగించి, 599 జిటిబి మోడల్ ఆధారంగా చేసుకొని రూపొందించిన నాన్-స్ట్రీట్ లీగల్ ట్రాక్ కార్ 599ఎక్స్ఎక్స్ ఇవోలో వి12 6.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 743 పిఎస్ల శక్తిని, 700 ఎన్ఎమ్ల టార్క్ను విడుదల చేస్తుంది. ఇది గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్లకు పైగా వేగంతో పరుగులు పెడుతుంది.
గత నెలలో ఇటలీలో సంభవించిన భూకంపం కారణంగా 23 మంది ప్రజలు ప్రాణాలను కోల్పోగా, సుమారు 20,000 మందికి పైగా ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. గడచిన సంవత్సరంలో కూడా, జపాన్లో సంభవించిన భూకంపం కారణంగా నిరాశ్రయులైన వారి కోసం ఫెరారీ 80 మిలియన్ యెన్ (రూ.5.57 కోట్ల)ను విరాళంగా అందజేసింది.


Click it and Unblock the Notifications








