మానేసర్ ఎఫెక్ట్: మారుతి సుజుకి కొత్త ప్లాంట్ గుజరాత్లోనే
సుమారు రూ.4,000 కోట్ల రూపాయలతో, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కార్ల తయారీ ప్లాంటును గుజరాత్లో ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపేందుకు గానూ మారుతి సుజుకి మాతృసంస్థ అయిన సుజుకి మోటార్ కార్పోరేషన్ సీఈఓ ఒసాము సుజుకి గుజరాత్కు విచ్చేయనున్నారు. రాష్ట్రంలో పెట్టబడుల విషయం చర్చించేందుకు ఆయన గుజరాత్కు రానున్నట్లు సమాచారం.
ఈ సమావేశంలో పలువురు అధికారులు, రాష్ట్ర మంత్రులు కూడా భేటీ కానున్నారు. ఒసాము సుజుకి గుజరాత్ పర్యటన ముగిసిన అనంతరం కొత్త ప్లాంటు పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతి సుజుకి హర్యానా తర్వాత ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులను పెట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్లాంట్ 2015-16 నాటికి పూర్తి కావచ్చని తెలుస్తోంది. ప్రారంభంలో భాగంగా, సాలీనా 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ను నిర్మించనున్నారు.
గుజరాత్లో ఏర్పాటు కానున్న ఈ కొత్త ప్లాంట్ అనేక మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధిని కల్పించనుంది. అయితే, మానేసర్ ప్లాంటులో తరచూ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో, కంపెనీ తమ ప్లాంట్ను అక్కడి నుంచి పూర్తిగా గుజరాత్కు తరలించి వేస్తుందని పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనలు ఏవీ లేవని కంపెనీ స్పష్టం చేసింది.
గడచిన నెలలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు సుజుకి మోటార్ కార్పోరేషన్ కంపెనీని సందర్శించారు. జపనీస్ కంపెనీలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు. గుజరాత్ రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలతో ఆటోమొబైల్ కంపెనీలను ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఇది ఆటోమొబైల్ హబ్గా మారినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.


Click it and Unblock the Notifications









