సెప్టెంబర్ 1వ తేది నుంచి పెరగనున్న టొయోటా కార్ల ధరలు
బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ జపానీస్ కార్ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెఎమ్) కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. వచ్చే నెల ఆరంభం నుంచి ఉత్పత్తుల ధరలను పెంచాలని టొయోటా నిర్ణయించింది. పతనమవుతున్న రూపాయి మారకపు విలువ కారణంగా ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వస్తుందని, సెప్టెంబర్ 1వ తేది నుంచి 1.5 శాతం మేర కార్ల ధరలను పెంచనున్నామని కంపెనీ పేర్కొంది.
గడచిన జూన్ నుంచి కంపెనీ ఇలా ధరలను పెంచడం ఇది రెండవ సారి. ఆ సమయంలో కూడా, రూపాయి విలువ కారణంగానే టొయోటా కిర్లోస్కర్ మోటార్ తమ ఉత్పత్తుల ధరలను 1 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే. రోజు రోజుకి పతనమవుతున్న రూపాయి మారకపు విలువ తమ మార్జిన్లపై ప్రభావాన్నిచూపుతుందని, దీన్ని సాధ్యమైనంత వరకూ తామే భరిస్తూ వచ్చామని, అయితే ఇప్పుడు ఇందులో కొంత భారాన్ని కస్టమర్లపై మోపక తప్పడం లేదని టికెఎమ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్ వెల్లడించారు.
అయితే, ఎంత మేరకు ధరలను పెంచాలనే దానిపై ఇంకా ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, ఈ పెంపుదల సుమారు 1.5 శాతం మేర ఉండవచ్చని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 1, 2012 నుంచి టొయోటా అందిస్తున్న అన్ని వాహనాల ధరలు పెరగుతాయని సందీప్ సింగ్ తెలిపారు. టొయోటా భారత మార్కెట్లో ఉత్పత్తి చేస్తున్న వివిధ మోడళ్లలో ఉపయోగించే అనేక విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.
మారుతున్న రూపాయి విలువ కంపెనీ విడిభాగాల దిగుమతిపై ప్రభావం చూపుతుంది. ఇలా దిగుమతి చేసుకునే విడిభాగాల ధరలు పెరిగి, ఉత్పాదక వ్యయం కూడా పెరుగుతుండటంతో ఉత్పత్తుల ధరలను పెంచేందుకు కంపెనీ మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం టొయోటా దేశీయ విపణిలో ఎతియోస్ లివా, ఎతియోస్, కరోలా ఆల్టిస్, క్యామ్రే, ఇన్నోవా, ఫార్చ్యూనర్, ల్యాండ్ క్రూజర్ కార్లను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








