సరికొత్త టోరెగ్ ఎస్యూవీని విడుదల చేయనున్న ఫోక్స్వ్యాగన్
జర్మనీకు చెందిన కార్ల తయారీ కంపెనీ ఫోక్స్వ్యాగన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న లగ్జరీ ఎస్యూవీ టోరెగ్లో ఓ సరికొత్త అప్గ్రేడెడ్ వెర్షన్ను కంపెనీ త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనుంది. లగ్జరీ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) సెగ్మెంట్లో గట్టి పోటీనిచ్చే విధంగా సరికొత్త హంగులతో తీర్చిదిద్దిన రిఫ్రెష్డ్ ఫోక్స్వ్యాగన్ టోరెగ్ ఈ పండుగ సీజన్లో విడుదలయ్యే ఆస్కారం ఉంది.
కొత్త టోరెగ్ ప్రస్తుతం టోరెగ్ కన్నా 40 మి.మీ. పొడవును కలిగి ఉండి మంచి ఇంటీరియర్ స్పేస్ను ఆఫర్ చేయనుంది. అలాగే, పాత టోరెగ్ కన్నా కొత్త టోరెగ్ 200 కేజీల తక్కువ బరువును కలిగి ఉండి మెరుగైన మైలేజ్ను ఆఫర్ చేయనుంది. ఇందులో పవర్ఫుల్ 3.0 లీటర్, 6-సిలిండర్ ఇంజన్ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 236 బిహెచ్పిల శక్తిని, 56.08 కెజిఎమ్ల టార్క్ను విడుదల చేస్తుంది. కొత్త ఫోక్స్వ్యాగన్ టోరెగ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ (ట్రాన్సిమిషన్)తో లభిస్తుంది.
కొత్త టోరెగ్లో డ్యాష్బోర్డ్పై రియర్ వ్యూ కెమెరా, టచ్ స్క్రీన్ ఆప్షన్తో కూడిన మల్టీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్, యాంత్రికంగా నియంత్రచబడే పవర్ సీట్స్, కీలెస్ ఎంట్రీ, డ్యూయెల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్రూఫ్, ఎక్కువ బూట్ స్పేస్ కోసం మడిచిపెట్టే వీలున్న వెనుక సీట్లు, రాత్రివేళల్లో స్పష్టమైన కాంతినిచ్చే ఆటోమేటిక్ బై-జెనాన్ హెడ్ల్యాంప్స్ వంటి ఫీచర్లను పొందవచ్చు.
డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఏబిఎస్ వంటి భద్రతా ఫీచర్లు కొత్త టోరెగ్ సొంతం. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్తో లభించే కొత్త ఫోక్స్వ్యాగన్ టోరెగ్ 5-సీటర్ ఆప్షన్తో మాత్రమే లభ్యం కానుంది. ఇది ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎల్-క్లాస్ (రూ.56.9 లక్షలు), బిఎమ్డబ్ల్యూ ఎక్స్5 (రూ.63.8 లక్షలు) వంటి లగ్జరీ కార్లతో పోటీ పడనుంది. భారత మార్కెట్లో కొత్త టోరెగ్ ధర రూ.58.4 లక్షలుగా ఉండొచ్చని అంచనా. (అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర).
కొత్త ఫోక్స్వ్యాగన్ టోరెగ్కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications









