గ్లోబల్ క్రాసోవర్గా 2015 ఫోర్డ్ ఎడ్జ్ ఆవిష్కరణ
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఓ సరికొత్త క్రాసోవర్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ క్రాసోవర్ పేరు 'ఫోర్డ్ ఎడ్జ్' (Ford Edge). లగ్జరీ విషయంలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కన్నా ఫోర్డ్ 2014 వెర్షన్ ఎడ్జ్ ఓ అడుగు ముందుంటుంది. ఫోర్డ్ తమ అధునాతన ఎడ్జ్ క్రాసోవర్రను అమెరికన్, యూరోపియన్ మార్కెట్లతో పాటుగా కొన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కూడా విక్రయించనుంది.
ఇదివరకటి తరం ఫోర్డ్ ఎడ్జ్ క్రాసోవర్ను 2006 వరకు నార్త్ అమెరికా మార్కెట్లో విక్రయించే వారు. ఆ తర్వాత 2008లో బ్రెజిల్లోను, 2011లో చైనాలో విక్రయించడం ప్రారంభించారు. అయితే, ఈ కొత్త 2015 ఫోర్డ్ ఎడ్జ్ అమ్మకాల విషయానికి వస్తే, నార్త్ అమెరికాలో 2015 ఆరంభంలోను ఆ తర్వాతి కాలంలో ప్రపంచంలోని ఇతర ప్రముఖ మార్కెట్లలోను అమ్ముడయ్యే అవకాశం ఉంది.

ధర ఎక్కువగా ఉండే పెద్ద ఎస్యూవీల కన్నా తమ ఎడ్జ్ క్రాసోవర్ ప్యాసింజర్లకు మంచి స్పేస్ను ఆఫర్ చేస్తుందని ఫోర్డ్ యూరప్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రోలంట్ డె వార్డ్ తెలిపారు. స్టయిల్, కంఫర్ట్, కన్వీనెన్స్, సేఫ్టీ, టెక్నాలజీ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎడ్జ్ క్రాసోవర్ రూపొందించామని ఆయన వివరించారు.
ఫోర్డ్ అందించనున్న ఈ కొత్త 2015 ఎడ్జ్ ఓ సెమీ లగ్జరీ క్రాసోవర్. ఇది ఈ సెగ్మెంట్లో ఆడి, బిఎమ్డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఫోక్స్వ్యాగన్ వంటి బ్రాండ్లు ఆఫర్ చేసే మోడళ్లతో పోటీపడుతుంది. 2015 ఫోర్డ్ ఎడ్జ్ను తొలిసారిగా లాస్ ఏంజిల్స్ ఆటో షోలో కాన్సెప్ట్ వెహికల్గా ప్రదర్శించారు. ఈ కొత్త ఫోర్డ్ మోడల్ ప్రపంచ వ్యాప్తంగా తమకు మంచి పేరు తెచ్చిపెట్టగలదని కంపెనీ ఆశిస్తోంది.

ఒకవేళ ఫోర్డ్ ఎడ్జ్ క్రాసోవర్ ఇండియన్ మార్కెట్కు వస్తే, దీనిని ప్రస్తుతం ఫోర్డ్ భారత్లో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్యూవీ ఈకోస్పోర్ట్కు ఎగువన ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇదొక 5-సీటర్ క్రాసోవర్, రెండు వరుసల సీటింగ్తో ముందు, వెనుక ప్రయాణీకులకు పూర్తి సౌకర్యాన్ని అందిస్తుంది. దీని ఫ్రంట్ డిజైన్ అధునాత ఫోర్డ్ ఎండీవర్ కాన్సెప్ట్ను తలపిస్తుంది.
అమెరికన్ మార్కెట్లో 2015 ఫోర్డ్ ఎడ్జ్ ధరను కంపెనీ వెల్లడి చేసింది. ఆ రేట్ల ప్రకారం మన కరెన్సీలో బేస్ వేరియంట్ ధర రూ.17.43 లక్షలు, టాప్ వేరియంట్ ధర రూ.24.32 లక్షలు ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








